PhonePe | ఇప్పుడు ఏ లావాదేవీ జరుపాలన్నా ఆన్లైన్లోనే.. మొబైల్ బ్యాంకింగ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్. మొబైల్ యాప్ ఉంటే మొబైల్ బ్యాంకింగ్ చేసేయొచ్చు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ మొబైల్ యాప్స్ ఫోన్పే, జీ-పే, పేటీఎం, భారత్పే, అమెజాన్ తదితర యాప్స్ ద్వారా దేశీయంగా చెల్లింపులు జరుపుతున్నారు. తాజాగా ఫోన్పే మరో అడుగు ముందుకేసింది. విదేశీ ప్రయాణాలు చేసే తమ భారతీయ యూజర్లకు ఆయా దేశాల్లోని మర్చంట్ల వద్ద యూపీఐ (యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) చెల్లింపులకు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించింది. అంటే భారతీయ యూజర్లకు విదేశాల్లో యూపీఏ పేమెంట్స్ను ప్రారంభించినట్లు మంగళవారం తెలిపింది.
స్థానిక క్యూఆర్ కోడ్ గల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఐ), సింగపూర్, మారిషస్, నేపాల్, భూటాన్ దేశాల్లోని మర్చంట్ల వద్ద `యూపీఐ ఇంటర్నేషనల్` సపోర్ట్ ఉంటుంది. ఈ దేశాల్లో పర్యటిస్తున్న భారతీయులు ఫోన్పే ద్వారా తమ భారతీయ బ్యాంక్ ద్వారా విదేశీ కరెన్సీలో నేరుగా చెల్లింపులు చేయొచ్చు. వారి ఇంటర్నేషనల్ డెబిట్ కార్డులతో కూడా చేయొచ్చు. విదేశాల్లో భారతీయ యూజర్లకు ఈ సౌకర్యం కల్పిస్తున్న తొలి ఇండియన్ ఫిన్టెక్ యాప్ ఫోన్పే కావడం విశేషం. ఫోన్పేకు ఈ-కామర్స్ జెయింట్ వాల్మార్ట్ మద్దతుగా నిలుస్తున్నది.
ప్రపంచవ్యాప్తంగా యూపీఐ సేవలు అందుబాటులోకి తేవడానికి యూపీఐ ఇంటర్నేషనల్ తొలి ప్రధాన చర్య అని ఫోన్పే కో-ఫౌండర్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ రాహుల్ చారి తెలిపారు. `యూపీఐ ఇంటర్నేషనల్ సేవలు గేమ్ చేంజర్ కానున్నాయి. విదేశీ మర్చంట్ ఔట్లెట్ల వద్ద యూపీఐతో భారతీయుల చెల్లింపులు పూర్తి పరివర్తన తేనున్నాయి. ప్రపంచమంతటా యూపీఐ సేవలు అవసరం ఉంది` అని అన్నారు.
ఇటీవలే జనరల్ అట్లాంటిక్ ద్వారా 350 మిలియన్ డాలర్ల నిధులు సేకరించింది ఫోన్పే. దీంతో గూగుల్పే, పేటీఎం, అమెజాన్ పే వంటి మొబైల్ యాప్స్ లావాదేవీలతో ఫోన్పే పోటీ పడేందుకు మార్గం సుగమం అయ్యిందని భావిస్తున్నారు. విదేశీ ప్రయాణాలకు వెళ్లే ఫోన్పే యూజర్లు.. ఫోన్పే యాప్ ద్వారా మర్చంట్ వద్ద యూపీఐ-లింక్డ్ బ్యాంక్ ఖాతాను యాక్టివేట్ చేసుకోవాలి. అటుపై సర్వీసులను యాక్టివేట్ చేయడానికి వారు తమ యూపీఐ పిన్ నంబర్ నమోదు చేయాల్సి ఉంటుంది.
ఇంటర్నేషనల్ మర్చంట్ ఔట్లెట్ల వద్ద భారతీయులు విదేశీ కరెన్సీ చెల్లించడానికి క్రెడిట్ లేదా ఫారెక్స్ కార్డులు కలిగి ఉండాలి. ఫోన్పే ఫీచర్తో యూపీఐ ద్వారా చెల్లింపులకు వారు తమ భారతీయ బ్యాంక్ ఖాతాను అనుసంధానిస్తే సరి. ఈ ఏడాది పలు ఇతర దేశాల్లో యూపీఐ సేవలు అందుబాటులోకి తేవడానికి ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్తో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) సహకార ఒప్పందం చేసుకోనున్నది.
యూపీఐని ఎన్పీసీఐ డెవలప్ చేసింది. 2015 డిసెంబర్లో ఫోన్పే ఏర్పాటైంది. నాటి నుంచి దేశంలోనే అతిపెద్ద పేమెంట్స్ యాప్గా అవతరించింది. ప్రస్తుతం 435 మిలియన్ల మంది యూజర్లు ఫోన్పేకు ఉన్నారు. ప్రతి నలుగురిలో ఒకరు ఫోన్పే వినియోగిస్తున్నారు.