న్యూఢిల్లీ : చాట్జీపీటీ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్ రాకతో టెక్ ప్రపంచంలో న్యూ టెక్నాలజీపై హాట్ డిబేట్ సాగుతోంది. ఏఐ టూల్స్తో కొలువుల కోత తప్పదనే ఆందోళన వ్యక్తమవుతున్న క్రమంలో ఏఐ తమ ఉద్యోగాలను రీప్లేస్ చేస్తుందని భారత ఉద్యోగుల్లో 74 శాతం మంది కలత చెందుతున్నారని లేటెస్ట్ సర్వే స్పష్టం చేసింది.
ఏఐతో తమ ఉద్యోగాలు కనుమరుగవుతాయని దేశీ ఉద్యోగుల్లో గుబులు రేగుతోందని తన ఫ్లాగ్షిప్ వర్క్ ట్రెండ్ ఇండెక్స్ 2023 నివేదికలో మైక్రోసాఫ్ట్ (Microsoft survey) స్పష్టం చేసింది. చాట్జీపీటీ, గూగుల్ బార్డ్, మైక్రోసాఫ్ట్ బింగ్ వంటి చాట్బాట్స్ రాకతో ఉద్యోగాలు ఊడతాయనే ఆందోళన టెకీల్లో నెలకొంది. భారత్ సహా 31 దేశాల్లోని వివిధ పరిశ్రమలకు చెందిన 31,000 మందిని ఈ సర్వే పలకరించింది. మైక్రోసాఫ్ట్ యాప్స్ ద్వారా ఈమెయిల్స్, సమావేశాలు, చిట్చాట్స్ ద్వారా లక్షలాది సంకేతాలు లభ్యమయ్యాయని పేర్కొంది.
లింక్డిన్లో లేబర్ ట్రెండ్స్ను కూడా కంపెనీ పరిగణనలోకి తీసుకుంది. ఏఐ రాకతో కొలువులు కోల్పోతామనే ఆందోళన భారత ఉద్యోగుల్లో కనిపించిందని ఈ నివేదిక ప్రధానంగా ప్రస్తావించింది. తమ పనులు నిర్వర్తించేందుకు అవసరమైన సరైన సామర్ధ్యాలు ప్రస్తుతం తమకు లేవని భారత ఉద్యోగుల్లో 78 శాతం మంది వెల్లడించడం విశేషం. ఏఐ వృద్ధికి సంసిద్ధమయ్యేలా ఉద్యోగులు నూతన నైపుణ్యాలను అలవరుచుకోవాలని భారత బిజినెస్ లీడర్లు కోరుతున్నారు. ఏఐతో ఉత్పాదకత పెరుగుతుందని పలువురు భారత మేనేజర్లు చెప్పుకొచ్చారు.
Read More
ChatGPT | ఏఐతో మానవాళి అంతరించిపోతుంది : టెక్ దిగ్గజాల వార్నింగ్
TCS | కార్యాలయాలకు రాకుంటే కఠిన చర్యలు : ఉద్యోగులకు టీసీఎస్ వార్నింగ్