Elon Musk | ట్విట్టర్ను టేకోవర్ చేశాక, అందులో పని చేస్తున్న 75 శాతం మంది సిబ్బందిని తొలగించేందుకు ప్రణాళికలేమీ వేయలేదని టెస్లా సీఈవో ఎలన్మస్క్ వెల్లడించారు. శుక్రవారానికి మైక్రోబ్లాగింగ్ సైట్ ‘ట్విట్టర్’ను ఎలన్మస్క్ స్వాధీనం చేసుకునే ప్రక్రియ ముగియనున్నది. ముందుగా ప్రతిపాదించిన 44 బిలియన్ డాలర్లకే ట్విట్టర్ను ఎలన్మస్క్ టేకోవర్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులను తొలగించే ప్రణాళికేమీ లేదని ఎలన్మస్క్ వెల్లడించడంతో ట్విట్టర్ ఉద్యోగులకు రిలీఫ్ లభించినట్లయింది. గురువారం ట్విట్టర్ యాజమాన్యంతో సంప్రదింపుల కోసం సంస్థ కార్యాలయానికి ఎలన్మస్క్ వచ్చారు.
ట్విట్టర్ను టేకోవర్ చేస్తే సంస్థలో 75 శాతం ఉద్యోగులను ఎలన్మస్క్ తొలగించనున్నారని గతవారం వాషింగ్టన్ పోస్ట్ ఒక వార్తాకథనం ప్రచురించింది. ట్విట్టర్లో ప్రస్తుతం 7,500 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. అందులో నాలుగింట మూడొంతుల మంది ఉద్యోగులను తొలగిస్తానని ఇన్వెస్టర్లకు ఎలన్మస్క్ చెప్పినట్లు సమాచారం. అయితే, లేఆఫ్లపై ట్విట్టర్ యాజమాన్యం వివరణ ఇచ్చింది. అటువంటిదేమీ లేదని పేర్కొంది. ట్విట్టర్ జనరల్ కౌన్సిల్ సియాన్ ఎడ్గెట్ స్పందిస్తూ ఉద్యోగులకు పింక్ స్లిప్లు ఇచ్చే ఆలోచనేమీ లేదని తెలిపారు.
ఇదిలా ఉంటే, ట్విట్టర్ను ఎలన్మస్క్ టేకోవర్ చేయనున్నారని వార్త రావడంతోనే సంస్థ ‘వైస్ప్రెసిడెంట్ ఆఫ్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ ఫర్ హెల్త్ ట్విట్టర్ కన్వర్షేషన్ అండ్ గ్రోత్ ఇల్ల్యా బ్రౌన్, సర్వీస్ వైస్ ప్రెసిడెంట్ కత్రినా లేన్, డేటా సైన్స్ హెడ్ మాక్స్ స్కిమైజర్ తదితరులు వైదొలిగారు. ప్రస్తుతం ట్విట్టర్ సీఈవోగా ఉన్న పరాగ్ అగర్వాల్తో ఎలన్మస్క్ విభేదాల్లో దాపరికమేమీ లేదు. ఒప్పందం ప్రకారం డీల్ పూర్తయితే తర్వాతీ పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు పరాగ్ అగర్వాల్ తెలిపారు.