Artemis returns | జాబిలిపైకి వెళ్లిన నాసా అంతరిక్ష నౌక ‘ఓరియన్’ సురక్షితంగా భూమికి చేరింది. ఆదివారం పసిఫిక్ మహా సముద్రంలో పారాచూట్ సాయంతో దిగింది. మెక్సికోలోని గ్వాడాలుపే ద్వీపం సమీపంలో దిగినట్లు నాసా వెల్లడించింది. ఈ నౌక అంతరిక్షంలో దాదాపు 14 లక్షల మైళ్లు ప్రయాణించి తిరిగొచ్చింది. ఆర్టెమిస్-1 మూన్ మిషన్లో భాగంగా ఓరియన్ నౌకను 25 రోజుల క్రితం గత నెల 15 న నాసా ప్రయోగించింది. సాంకేతిక కారణాలతో ఆర్టెమిస్-1 ప్రయోగం మూడు సార్లు వాయిదా పడింది.
నాసా తెలిపిన వివరాల ప్రకారం, ఓరియన్ నౌన తొలిసారిగా ‘స్కిప్ ఎంట్రీ’ టెక్నిక్ని అనుసరించడం ద్వారా భూమిపైకి దిగింది. ఈ ప్రక్రియలో మూడు దశలు ఉంటాయి. ఓరియన్ మొదట భూ వాతావరణం ఎగువ భాగంలోకి ప్రవేశించింది. అనంతరం దానిలోని క్యాప్సూల్ సాయంతో వాతావరణం నుంచి బయటకు వచ్చింది. చివరకు పారాచూట్ ద్వారా కిందికి దిగింది. స్కిప్ ఎంట్రీ సమయంలో స్పేస్క్రాఫ్ట్ సిబ్బంది మాడ్యూల్, సర్వీస్ మాడ్యూల్ ఒకదానికొకటి వేరు చేశారు. సర్వీస్ మాడ్యూల్ మంటల్లో చిక్కుకోగా, సిబ్బంది మాడ్యూల్ నిర్దేశిత ప్రదేశానికి పారాచూట్ చేర్చింది. భూ వాతావరణంలోకి ప్రవేశించేటప్పుడు ఓరియన్ నౌక వేగాన్ని గణనీయంగా తగ్గించారు.
Splashdown.
After traveling 1.4 million miles through space, orbiting the Moon, and collecting data that will prepare us to send astronauts on future #Artemis missions, the @NASA_Orion spacecraft is home. pic.twitter.com/ORxCtGa9v7
— NASA (@NASA) December 11, 2022
ఆర్టెమిస్-1 మూన్ మిషన్ కేవలం టెస్ట్ ఫ్లైట్. ఆర్టెమిస్-2 మూన్ మిషన్లో వ్యోమగాములను పంపేందుకు నాసా సన్నాహాలు చేస్తున్నది. ఈ పరిస్థితిలో శాస్త్రవేత్తలు భూమిపైకి ఒరియన్ ల్యాండింగ్ను నిశితంగా పరిశీలించారు. అలాగే, నాసా తాజా సాంకేతికత స్కిప్ ఎంట్రీని కూడా జాగ్రత్తగా గమనించారు. తదుపరి మూన్ మిషన్ నౌక టెస్ట్ ఫ్లైట్ ఫలితంపై ఆధారపడి ఉంటుంది. 2024 లో లాంచ్ చేయాలనే ఆలోచనలో నాసా ఉన్నది.