Elon Musk-Twitter | ప్రపంచంలోనే అత్యంత కుబేరుడు ఎలన్మస్క్ సోషల్ మీడియా సైట్ ట్విట్టర్ను టేకోవర్ చేయడం పూర్తయితే 75శాతం మంది ఉద్యోగులను సాగనంపనున్నారని వార్తలొచ్చాయి. కానీ, ట్విట్టర్ ఉద్యోగుల లే-ఆఫ్లు ఉండబోవని కంపెనీ ప్రకటించడం గమనార్హం. సుదీర్ఘకాలంగా ట్విట్టర్ను టేకోవర్ చేస్తానని ఎలన్మస్క్ చెబుతున్న వార్తలు నిత్యం చూస్తూనే ఉన్నామని తెలిసిందే.
వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం ఎలన్మస్క్ కొందరు ఇన్వెస్టర్లతో మాట్లాడుతూ తాను ట్విట్టర్ను కొనుగోలు చేస్తానని చెప్పారు. ట్విట్టర్ కొనుగోలు ప్రక్రియ పూర్తయితే ఇప్పుడు ఉన్న 7,500 మంది ఉద్యోగుల్లో 75 శాతం మందిని అంటే 5600 మందిని సాగనంపుతానని చెప్పినట్లు ఆ వార్త సారాంశం. ఇన్వెస్టర్లతో ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ల ఆధారంగా ఈ వార్తాకథనం ప్రచురించాం అని వాషింగ్టన్ పోస్ట్ ప్రకటించింది.
ఈ వార్త వెలుగు చూడగానే ట్విట్టర్ తక్షణం రియాక్టయింది. ఉద్యోగుల భారీ తొలగింపు ప్రణాళికలేమీ తమ సంస్థ వద్ద లేవని వివరణ ఇచ్చింది. లే-ఆఫ్ ప్లాన్లు సంస్థ యాజమాన్యం ముంగిట లేవని ట్విట్టర్ తరఫు న్యాయవాది సియాన్ ఎడ్గెట్ సంస్థ ఉద్యోగులకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చారని రాయిటర్స్ పేర్కొన్నది.
రాయిటర్స్ కథనం ప్రకారం కొన్ని నెలల్లో ఎలన్మస్క్ చేతికి ట్విట్టర్ వస్తుందని సమాచారం. ఒకవేళ ట్విట్టర్ను ఎలన్మస్క్ టేకోవర్ చేయకపోయినా.. మైక్రో బ్లాగింగ్ సైట్ సుమారు 800 మిలియన్ల డాలర్ల ఖర్చు తగ్గించుకునేందుకు ఉద్యోగులను భారీగా తొలగించడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ట్విట్టర్ ఉద్యోగులు లే-ఆఫ్లు లేవని చెబుతున్నా.. మౌలిక వసతుల ఖర్చులు తగ్గించుకోవడంతోపాటు సిబ్బందిని కుదించడానికి ప్రణాళికలు సిద్ధం అయ్యాయని సమాచారం.
ట్విట్టర్ డీల్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన ఎలన్మస్క్ ఇటీవలే యూటర్న్ తీసుకున్నారు. ట్విట్టర్ టేకోవర్ లావాదేవీపై న్యాయ పోరాటానికి స్వస్తి పలుకాలని కోరుతున్నట్లు మస్క్ న్యాయవాదులు తెలిపారు. ట్విట్టర్ అధికార ప్రతినిధి కూడా దీన్ని ధృవీకరించారు. ట్విట్టర్ టేకోవర్పై ఆ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు రావడానికి ముందు ఎలన్మస్క్ యూటర్న్ తీసుకోవడం గమనార్హం. ఏప్రిల్లో ఇచ్చిన హామీ మేరకు షేర్కు 54.20 డాలర్ల చొప్పున ట్విట్టర్ను టేకోవర్ చేస్తానని మస్క్ చెప్పారు.