Satya Nadella | బిర్యానీ.. భారత్లో కేవలం పాపులర్ వంటకం మాత్రమే కాదు.. భారతీయులు.. ప్రత్యేకించి హైదరాబాదీలకు భావోద్వేగాలతో కూడుకున్న అంశం. కొద్ది మంది దీన్ని తినకపోవచ్చు. కానీ చాలా మంది ప్రతి రోజూ బిర్యానీ తింటారు. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ చైర్మన్ & సీఈవో సత్య నాదెళ్ల సైతం బిర్యానీని అంతగా ప్రేమిస్తారు. ఇటీవలే పాపులరైన ఛాట్ జీపీటీ-చాట్ రోబోట్తో సత్య నాదెళ్ల బుధవారం నిర్వహించిన చర్చాగోష్టిలో బిర్యానీని టిఫిన్గా చూపెట్టడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
బెంగళూరులో బుధవారం `ఫ్యూచర్ రెడీ టెక్నాలజీ సమ్మిట్`లో మాట్లాడుతూ సత్యనాదెళ్ల.. ఛాట్ జీపీటీ ( ChatGPT) తో చాటింగ్ నిర్వహించారు. పాపులర్ దక్షిణ భారత అల్ఫాహారాల జాబితా ఇవ్వమని కోరితే.. ఇడ్లీ వడ, దోశలతోపాటు బిర్యానీని సౌత్ ఇండియన్ టిఫిన్స్ జాబితాలో చూపెట్టింది ఛాట్ జీపీటీ. ఈ జాబితాతో తాను అంగీకరించబోనని సత్యనాదెళ్ల చెప్పారు.
బిర్యానీని సౌత్ ఇండియన్ టిఫిన్గా పేర్కొంటూ సాఫ్ట్వేర్.. తన ఇంటెలిజెన్స్ను అవమానించొద్దని పేర్కొన్నారు. దీంతో స్పందించిన ఛాట్ జీపీటీ వెంటనే క్షమాపణ చెప్పింది. `ఐయామ్ సారీ`, `మీరు చెప్పిందే నిజం` అని పేర్కొంది.
ప్రజాదరణ పొందిన కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సాఫ్ట్వేర్-చాట్రోబోట్ను ఛాట్ జీపీటీ అని పిలుస్తున్నారు. `ఓపెన్ ఏఐ` అనే సంస్థ గత నవంబర్లో ఛాట్ జీపీటీ అనే చాట్రోబోట్ను ప్రారంభించింది. డైలాగ్ ఫార్మాట్లో ఛాట్ జీపీటీ సమాధానాలు ఇస్తుంది. పొరపాట్లను అంగీకరిస్తుంది. సంబంధం లేని, తగని, అనుచిత ప్రశ్నలకు తిరస్కరిస్తుంది.