Smart Phones | త్వరలో దేశంలో 5జీ సేవలు ప్రారంభం కాబోతున్నాయి. తదనుగుణంగా స్మార్ట్ ఫోన్ యూజర్లు తమ ఫోన్లను అప్గ్రేడ్ చేసుకోవాలి.. లేదా 5జీ సామర్థ్యం గల స్మార్ట్ ఫోన్లు కొనుక్కోవాల్సి ఉంటుంది. స్మార్ట్ ఫోన్ల తయారీకి అవసరమైన పలు విడి భాగాలు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. అలా దిగుమతి చేసుకుంటున్న విడి భాగాలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 10 నుంచి 15 శాతానికి పెంచుతున్నట్లు కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ డ్యూటీ బోర్డు (సీబీఐసీ) ప్రకటించింది. కనుక స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థలు పెరిగిన కస్టమ్స్ డ్యూటీ భారాన్ని వినియోగదారులపై మోపనున్నాయి. అదే జరిగితే భారత్లో తయారయ్యే స్మార్ట్ ఫోన్లు పిరం కానున్నాయి.
`సిమ్ ట్రే, యాంటెన్నా పిన్స్, వాల్యూమ్, పవర్, సెన్సర్లు, స్పీకర్లు, ఫింగర్ ప్రింట్ వంటి వాటి కోసం
ప్రింటెడ్ సర్క్యూట్స్ (ఎఫ్పీసీ), స్పీకర్ నెట్, పవర్ కీ, స్లయిడర్ స్విచ్, బ్యాటరీ కంపార్ట్మెంట్, డిస్ప్లే అసెంబ్లీ విత్/ విత్ఔట్ సపోర్ట్ ఫ్రేమ్ ఆఫ్ మెటల్/ప్లాస్టిక్ తదితర అసెంబ్లింగ్ విడి భాగాలు దిగుమతి చేసుకుంటే వాటిపై 15శాతం బేసిక్ కస్టమ్ డ్యూటీ అమలవుతుంది` అని సీబీఐసీ తెలిపింది.
ఒకవేళ డిస్ప్లే అసెంబ్లింగ్లో అదనపు కాంపొనెంట్స్ జత చేస్తే సంబంధిత స్మార్ట్ ఫోన్ల తయారీ దారులు తమ నోటిఫికేషన్ ప్రకారం మినహాయింపు నిబంధనలను ఉల్లంఘించడమేనని సీబీఐసీ పేర్కొంది. వివో, ఒప్పో వంటి స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థలు కస్టమ్స్ డ్యూటీ ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. అటువంటి సంస్థలకు సీబీఐసీ అధికారులు నోటీసులు జారీ చేశారు.