Tech News | వైకల్యం వ్యక్తికి సవాలు. సమాజానికి పరీక్ష. అందుకే, సామాజిక బాధ్యతగా కొన్ని సంస్థలు దివ్యాంగుల కోసం అనేక ఆవిష్కరణలు చేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల మంది వివిధ రకాలైన శారీరక వైకల్యాలతో బాధపడుతున్నారని అంచనా. భారతదేశంలో 2 కోట్ల 68 లక్షల మంది దివ్యాంగులు ఉన్నట్టు ప్రభుత్వ గణాంకాలు పేర్కొంటున్నాయి. చదువు, ఉపాధి, అవకాశాలు మొదలైన విషయంలో వీళ్లంతా ఏదో ఒక రూపంలో వివక్ష, సవాళ్లు ఎదుర్కొంటున్నారు. ఆధునిక సాంకేతికత ఆ దివ్యాంగుల ప్రయాణాన్ని సులభతరం చేస్తున్నది.
చక్రాల కుర్చీపై
నడవలేని వారికోసం ఎక్కువ దూరం వెళ్లగలిగే చక్రాల కుర్చీలు రూపొందిస్తున్నది నియోమోషన్ అనే స్టార్టప్. ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ కేంద్రంగా పనిచేస్తున్నది. ఈ కుర్చీలో రెండు ప్రధాన అంశాలు ఉన్నాయి. మొదటిది నియోఫ్లై. ఇది వైద్యుల సూచనల మేరకు, ఆ వ్యక్తి అవసరానికి తగినట్టు రూపొందించిన చక్రాల కుర్చీ. దీనికి నియోబోల్ట్ను అనుసంధానం చేసుకుంటే.. అదే చక్రాల కుర్చీ ఎలక్ట్రిక్ స్కూటర్లా మారిపోతుంది. నియోబోల్ట్ బ్యాటరీని ఒక్కసారి చార్జ్ చేస్తే 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఆన్లైన్ ఆహార డెలివరీ సంస్థ జొమాటో సిబ్బందిలో సరిగ్గా నడవలేని వాళ్లు 160 మంది వరకూ ఉన్నారు. ఈ చక్రాల కుర్చీ సాయంతో వీళ్లంతా ఆహార పదార్థాలను ఇంటింటికీ చేరవేస్తున్నారు. ఈ సాంకేతికత పట్ల జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ సంతోషం వ్యక్తంచేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన ట్విటర్లో షేర్ చేశారు కూడా. మోబిస్ అనే వాహనాల పరికరాల సంస్థ గత ఏడాది 500 చక్రాల కుర్చీల కోసం నియోమోషన్తో ఒప్పందం కుదుర్చుకున్నది.
బ్రెయిలీ సులువుగా
అంధులు చదువుకోవడానికి ప్రత్యేకించిన లిపి బ్రెయిలీ. ఈ లిపి నేర్చుకోవడాన్ని థింకర్బెల్ ల్యాబ్స్ అన్నీ అనే పరికరం మరింత సులభతరం చేస్తున్నది. ఇది పిల్లలు బ్రెయిలీని చదవడం, ఆ లిపిలో రాయడం, అక్షరాలు టైప్ చేయడం నేర్పిస్తుంది. అంతేకాదు అన్నీ పరికరం విద్యార్థులు రాసిన జవాబులను వెంటనే మూల్యాంకనం చేస్తుంది. పిల్లలకు తగిన ఫీడ్బ్యాక్ కూడా ఇస్తుంది.
గొంతులేనివారికి
విశాల్రావు అనే క్యాన్సర్ వైద్యుడు శశాంక్ మహేశ్ అనే సోషల్ ఆంత్రప్రెన్యూర్తో కలిసి ‘ఇనామ్యుయేషన్ మెడికల్ డివైసెస్’ను స్థాపించారు. స్వరపేటిక లేనివారు, గొంతు క్యాన్సర్తో బాధపడుతున్న వారికోసం ఓం (ఏయూఎం) పేరుతో కృత్రిమ స్వరపేటిక రూపొందించారు. దీని ఖరీదు కూడా తక్కువే. రోగుల గొంతులో ఈ పరికరం అమర్చడానికి కేవలం 15 నిమిషాలు చాలు. అదీ 50 రూపాయల ఖర్చుతోనే. విశాల్, శశాంక్ కృషికి ఎన్నో అవార్డులు, రివార్డులు వచ్చాయి.
వినికిడి లోపం ఉంటే..
‘బ్లీటెక్’ అనే స్టార్టప్ బధిరుల కోసం బ్లీటీవీ లైబ్రరీని తీసుకొచ్చింది. ఇది బధిరులకు ఇండియన్ సైన్ లాంగ్వేజ్ (ఐఎస్ఎల్)లో ఉన్న సమాచారాన్ని ఆకళింపు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. పిల్లలు సులువుగా అర్థం చేసుకునేలా కథలు, యాక్టివిటీస్ కలిగిన బ్లీ బుక్స్ కూడా ఉన్నాయి. బ్లీటెక్తోపాటు ఏవా లాంటి యాప్స్ కూడా సహాయకారిగా ఉంటున్నాయి. దీన్ని స్మార్ట్ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని మైక్రోఫోన్ సాయంతో సంభాషణను ఎదుటివారికి అర్థమయ్యేలా లిపి రూపంలో చేరవేయవచ్చు.
పార్కిన్సన్ రోగులకు
పార్కిన్సన్తో బాధపడేవారికి చేతిలో చెంచాను పట్టుకుని తినడం కూడా ఇబ్బందే! ఈ విషయాన్ని అమెరికాకు చెందిన లిఫ్ట్ ల్యాబ్స్ 2013లోనే గుర్తించింది. లిఫ్ట్ ల్యాబ్స్ను మిషిగన్ యూనివర్సిటీకి చెందిన అనుపమ్ పాఠక్ స్థాపించాడు. పార్కిన్సన్ పీడితులు సులువుగా తినడానికి ప్రత్యేకంగా చెంచాలు రూపొందించాడు. ఈ చెంచాలో ఉండే యాక్సెలరోమీటర్ పార్కిన్సన్ రోగుల ఇబ్బందిని గుర్తిస్తుంది. దీనికి యాక్చువేటర్ సాయంతో ప్రతిస్పందిస్తుంది. లిఫ్ట్ ల్యాబ్స్ను ఆ మధ్య గూగుల్ కైవసం చేసుకుంది.