న్యూఢిల్లీ: ఇండియాలో జియోఫోన్ నెక్ట్స్( JioPhone Next ) స్మార్ట్ఫోన్ ప్రి బుకింగ్స్ వచ్చే వారమే ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రిలయన్స్ జియో, గూగుల్ కలిసి డెవలప్ చేసిన ఈ స్మార్ట్ఫోన్ చాలా తక్కువ ధరకే అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ గురించి జూన్లో జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశంలో చైర్మన్ ముకేశ్ అంబానీ వెల్లడించారు. ఇప్పటికే ప్రిఆర్డర్ల కోసం రిలయన్స్ తమ రిటెయిల్ పార్ట్నర్లతో సంప్రదిస్తున్నట్లు 91మొబైల్స్ వెబ్సైట్ తెలిపింది. సెప్టెంబర్ 10న ఈ ఫోన్ అందుబాటులోకి వస్తుందని ఏజీఎంలోనే అంబానీ చెప్పారు.
జియోఫోన్ నెక్ట్స్ ధర ఎంత?
జియోఫోన్ నెక్ట్స్ ధరను ఇండియాలో అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఇది ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే అతి తక్కువ ధర స్మార్ట్ఫోన్గా నిలవబోతోందని జియో చెబుతోంది. అయితే జియోఫోన్ నెక్ట్స్ ధర రూ.3499గా ఉండే అవకాశం ఉన్నట్లు టిప్స్టర్ తెలిపంది. 5.5 అంగుళాల హెచ్డీ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 11 ఓఎస్, క్వాల్కామ్ క్యూఎం215 ఎస్ఓసీలతో ఈ ఫోన్ వచ్చే అవకాశం ఉంది. 2జీబీ, 3జీబీ ర్యామ్.. 16 జీబీ, 32 జీబీ స్టోరేజ్ కెపాసిటీలతో జియోఫోన్ నెక్ట్స్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది.