న్యూఢిల్లీ : సురక్షిత, భద్రతతో కూడిన కృత్రిమ మేధ (AI) అవసరమని జపాన్ కమ్యూనికేషన్ల, విదేశీ వ్యవహారాల మంత్రి హిరోషి యోషిద పిలుపు ఇచ్చారు. ఈ దిశగా భారత్ చురుకైన పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ అత్యంత కీలకమైన అంశమని, అది మన జీవితాలను, సమాజాన్ని మారుస్తుందని, ఏఐతో పొంచి ఉన్న ముప్పులను నివారించేందుకు మనం పనిచేయాల్సిన అవసరం ఉందని యోషిద పేర్కొన్నారు.
బాధ్యతాయుతమైన ఏఐ అత్యంత కీలకమని స్పష్టం చేశారు. ఏఐతో విస్తృత అవకాశాలు అందుబాటులోకి రానుండగా సురక్షిత, భద్రతతో కూడిన ఏఐ అవసరమని నొక్కిచెప్పారు. ఇక మానవ సౌభాగ్యానికి, అభివృద్ధికి ఏఐ అవసరమని, అయితే భద్రత విషయంలో రాజీపడరాదని బ్రిటన్ ఏఐ, మేథోసంపత్తి హక్కుల మంత్రి జొనాధన్ కమ్రోస్ పేర్కొన్నారు. ఈ దిశగా భారత్, యూరప్ సహా ప్రపంచ దేశాలన్నింటితో తాము సమన్వయంతో పనిచేస్తామని చెప్పారు.
ఢిల్లీలో ఈనెల 12 నుంచి 14 వరకూ జరిగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్లోబల్ పార్టనర్షిప్ సమ్మిట్లో పెద్దసంఖ్యలో దేశ, విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. 2020 జూన్ నుంచి ఏఐ అడ్వాన్స్మెంట్పై అన్ని వర్గాలకు చెందిన స్టేక్హోల్డర్లను భారత్ ఒక వేదకపైకి తీసుకొస్తోంది. మానవ హక్కులను గౌరవిస్తూ ప్రజాస్వామిక విలువలకు అద్దం పట్టేలా బాధ్యతాయుత అభివృద్ధి దిశగా ఏఐని చేపట్టాలనే లక్ష్యంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై గ్లోబల్ పార్టనర్షిప్ ఏర్పాటైంది.
Read More :