Ant-Paytm | చైనా వ్యాపారవేత్త జాక్మా సారధ్యంలోని ఫిన్టెక్ సంస్థ ఆంట్ గ్రూప్.. భారత్లోని ఫిన్టెక్ కంపెనీ పేటీఎంలో వాటాలను విక్రయించాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం. షేర్ల బైబ్యాక్తో పేటీఎంలో ఆంట్ గ్రూప్ వాటా పెరిగింది. ఇలా పెరిగిన వాటాలను విక్రయించాలని ఆంట్ గ్రూప్ భావిస్తున్నదని సమాచారం. పేటీఎంలో వాటాల విక్రయంపై ఆంట్ గ్రూప్ జరుపుతున్న చర్చలు ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాయని తెలుస్తున్నది. షేర్ ధర, రెగ్యులేటరీ సంస్థల అనుమతులను బట్టి ఎంత వాటా విక్రయించాలన్న విషయమై రెండు సంస్థలు ఓ నిర్ణయానికి వస్తాయని సమాచారం. దీనిపై అప్పటికప్పుడు స్పందించడానికి ఆంట్ ముందుకు రాలేదు. పేటీఎం స్పందించడానికి నిరాకరించింది.
ఆంట్ గ్రూప్ మాతృసంస్థ.. చైనా ఈ-కామర్స్ జెయింట్ అలీబాబా మాత్రం భారత్తో పెరుగుతున్న భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా పేటీఎంలో వాటాలను విక్రయిస్తున్నట్లు సమాచారం. కానీ ఆంట్ గ్రూప్ తన వాటా విక్రయానికి సాంకేతిక అంశాలే తప్ప రాజకీయ కారణం కాదని ఆ సంస్థ వర్గాలు తెలిపాయి.
గతేడాది డిసెంబర్ చివరి నాటికి పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్లో ఆంట్ గ్రూప్కు 24.86 శాతం వాటా ఉంది. కానీ షేర్ల బై బ్యాక్ వల్ల ఆంట్ గ్రూప్ వాటా 25 శాతానికి పైగా పెరిగింది. అలా పెరిగిన వాటాను విక్రయించడానికి ఆంట్ గ్రూప్కు 90 రోజుల గడువు మాత్రమే ఉంది. డిసెంబర్లో పేటీఎం 8500 కోట్ల (100 మిలియన్ల డాలర్లు) విలువైన షేర్ల బై బ్యాక్ ప్రకటించింది.
ఒకవైపు పేటీఎంలో ఆంట్ గ్రూప్ వాటాల విక్రయానికి సిద్ధం కాగా, భారత్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ అధినేత సునీల్ మిట్టల్.. పేటీఎంలో వాటా కొనుగోలుకు సిద్ధం అయ్యారు. తన భారతీ ఎంటర్ ప్రైజెస్ అనుబంధ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ను పేటీఎంలో విలీనం చేసి, ఆ మేరకు పేటీఎంలో వాటాను సునీల్ మిట్టల్ తీసుకోనున్నారని సమాచారం. పేటీఎం-సునీల్ మిట్టల్ మధ్య చర్చలు కూడా ప్రాథమిక దశలోనే ఉన్నాయని రెండు సంస్థల వర్గాలు తెలిపాయి.
చైనా ఆవల ఆంట్ గ్రూప్ పది ఫిన్టెక్ సంస్థల్లో వాటాలు కొనుగోలు చేసింది. ఆసియా అంతటా పేమెంట్ సర్వీసుల నెట్వర్క్ నిర్మించాలని ఆంట్ గ్రూప్ లక్ష్యం. చైనాలో ఫైనాన్సియల్ హోల్డింగ్ కంపెనీ లైసెన్స్కు దరఖాస్తు చేయడానికి ఆ దేశ ప్రభుత్వ అనుమతి కోసం ఆంట్ గ్రూప్ వేచి చూస్తున్నది. ఇటీవలే ఆంట్ గ్రూప్కు వినియోగ రుణాల మంజూరుకు చైనా నియంత్రణ సంస్థలు అనుమతి ఇచ్చాయి. తద్వారా ఆంట్ గ్రూప్ పెట్టుబడులు పెరుగనున్నట్లు సమాచారం. ఆలీబాబా, ఆంట్ గ్రూప్ల వ్యవస్థాపకుడు జాక్మా.. ఇటీవలి కాలంలో ప్రజా జీవితానికి దూరంగా ఉన్నారు. ఆంట్ గ్రూప్పై నియంత్రణ హక్కులు వదులుకున్నప్పటికీ షేర్లు మాత్రం కలిగి ఉన్నారు.