I-Phone | చైనా-అమెరికా మధ్య తొలి నుంచి రాజకీయంగా, ఆర్థికంగా భౌగోళిక విభేదాలు కొనసాగుతున్నాయి. కరోనా మహమ్మారి చైనాలో వెలుగు చూసిన తర్వాత డ్రాగన్-అమెరికా మధ్య విబేధాలు మరింత పెరిగాయి. ఆపిల్ సహా పలు అమెరికా టెక్ దిగ్గజాలు చైనా నుంచి బయటకు వచ్చి, విదేశాల్లో ఉత్పాదక యూనిట్ల విస్తరణకు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఆ దిశలో ఆపిల్ భాగస్వామ్య సంస్థ ఫాక్స్కాన్ టెక్నాలజీ గ్రూప్ సంస్థ.. భారత్లో కొత్త ప్లాంట్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించింది. ఇందుకు 700 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నది. కొత్త ప్లాంట్లో ఐ-ఫోన్లు తయారు చేయాలని సంకల్పించిందని బ్లూంబర్గ్ ఒక వార్తాకథనం ప్రచురించింది.
తైవాన్ కేంద్రంగా పని చేస్తున్న సంస్థ ఫాక్స్కాన్.. బెంగళూర్ విమానాశ్రయానికి సమీపాన 300 ఎకరాల విస్తీర్ణంలో ప్లాంట్ నిర్మించనున్నది. ఇప్పటివరకు భారత్లో ఫాక్స్కాన్ పెట్టుబడుల్లో ఇదే గరిష్టం కానున్నది. ఈ యూనిట్లో ఆపిల్ ఐ-ఫోన్లను అసెంబ్లింగ్ చేయనున్నది. కొత్తగా ఎలక్ట్రిక్ వెహికల్స్ విడి భాగాలను తయారు చేయాలని సంకల్పించింది.
బెంగళూరులో కొత్త ప్లాంట్ ఏర్పాటుతో లక్ష మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నది ఫాక్స్కాన్. ప్రస్తుతం చైనాలోని జెంగ్ఝూలో గల ఐ-ఫోన్ అసెంబ్లింగ్ యూనిట్లో దాదాపు రెండు లక్షల మంది ఉద్యోగులు పని చేశారు. ఉత్పత్తి పూర్తి స్థాయిలో జరిగితే ఉద్యోగుల సంఖ్య పెరుగనున్నది.
భారత్లో 2017లో ఆపిల్ ఐ-ఫోన్ ఎస్ఈ మోడల్ ఫోన్తో ఉత్పత్తి ప్రారంభించింది. ఆపిల్కు మూడు ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ పార్టనర్లు ఫాక్స్కాన్, విస్ట్రోన్, పెగాట్రాన్ ఉన్నాయి. ఐ-ఫోన్ ఎస్ఈ తర్వాత ఐ-ఫోన్ 11, ఐ-ఫోన్ 12, ఐ-ఫోన్ 13లను భారత్లోనే ఉత్పత్తి చేసింది ఆపిల్. చెన్నైకి సమీపంలోని శ్రీపెరంబదూర్లో ఫాక్స్కాన్ ప్లాంట్ ఇప్పటికే ఐ-ఫోన్లను అసెంబ్లింగ్ చేస్తున్నది.