Smart Phones | భారత్లో స్మార్ట్ ఫోన్ల వినియోగం పడిపోతున్నది. 2021తో పోలిస్తే ఆరు శాతం తగ్గి 151.6 మిలియన్ యూనిట్లకు పడిపోయాయి. ఇప్పటికీ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ నంబర్ వన్గా నిలిచిందని కెనాల్యిస్ నివేదిక తెలిపింది. 2017 మూడో త్రైమాసికం నుంచి తొలిసారి 2022 చివరి త్రైమాసికంలో నంబర్ వన్ స్థానంలోకి వచ్చి చేరింది శ్యామ్సంగ్. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో 67 లక్షల స్మార్ట్ ఫోన్లు విక్రయించిన శ్యామ్సంగ్.. మార్కెట్లో 21 శాతం సొంతం చేసుకున్నది.
రెండో స్థానంలో చైనాకు చెందిన వివో కొనసాగుతున్నది. ప్రధానంగా ఆఫ్లైన్ చానెల్స్ ద్వారా విక్రయించినా 64 లక్షల స్మార్ట్ ఫోన్లు విక్రయించింది. `ప్రపంచంలోని ఇతర మార్కెట్లతో పోలిస్తే భారత్లో పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయి. కానీ, భారత్లో స్థానిక వినియోగదారులు ఖర్చు తగ్గిస్తున్నారు` అని కెనాల్యిస్ అనలిస్ట్ చౌరాసియా చెప్పారు. ఫెస్టివ్ సీజన్లోనూ భారత్ మార్కెట్లో లావాదేవీలు తగ్గిపోతున్నాయి. రిటైల్ స్పెండింగ్, ఎలక్ట్రానిక్ దిగుమతులు పడిపోయాయని ఈ సంస్థ పేర్కొంది.
`2022లో స్మార్ట్ ఫోన్ల వినియోగదారులు కరోనా మహమ్మారి వేళ కొనుగోలు చేసిన ఫోన్లను ఆల్రెడీ అప్డేట్ చేసుకున్నారు. తదుపరి కొనుగోళ్లు ఆలస్యం చేస్తున్నారు. గిరాకీ లేకపోవడంతో నిల్వలు విక్రయించడానికి వివిధ స్మార్ట్ ఫోన్ల బ్రాండ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి` అని చౌరాసియా వ్యాఖ్యానించారు.
ప్రపంచ ఆర్థిక మాంద్యం ప్రభావం 2022 చివరికల్లా భారత్ ఆర్థిక వ్యవస్థపై పడుతుందని భావించారు. `ఇప్పుడు మనం 2023లో ప్రవేశించాం. స్వల్పకాలికంగా గిరాకీ తగ్గుతుందని ఆర్థిక సూచికలు చెబుతున్నాయి` అని చౌరాసియా తెలిపారు. 2023లో 5జీ స్మార్ట్ ఫోన్ల రీప్లేస్మెంట్తో స్వల్పంగా భారత స్మార్ట్ ఫోన్ల మార్కెట్ పెరుగుతుందని అంచనా వేస్తున్నామని అన్నారు.