Smart Phone Sales | ఒకవైపు 5జీ సేవలు దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. అందుకు అనుగుణంగా స్మార్ట్ ఫోన్ల విక్రయాలు పెరగాలి.. కానీ తగ్గుముఖం పట్టాయని ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) అంచనా వేసింది. మూడేండ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయాయని తెలిపింది. 4.3 కోట్ల ఫోన్లు మాత్రమే అమ్మకాలవుతాయని.. పది శాతం తగ్గుముఖం పట్టిందని ఐడీసీ వివరించింది. జూన్-సెప్టెంబర్ త్రైమాసికంలో మొత్తం స్మార్ట్ ఫోన్ల సేల్స్లో 5జీ ఫోన్ల విక్రయాలు 36 శాతం వాటా పొందాయి. 1.6 కోట్ల ఫోన్ల విక్రయాల్లో సగటున రూ.32 వేల (393 అమెరికా డాలర్లు) నుంచి రూ.30,600 (377 అమెరికా డాలర్లు) మధ్య ఉన్నాయని పేర్కొంది.
నవరాత్రి, దీపావళి పండుగల సీజన్ ఉన్నా 2019 తర్వాత సెప్టెంబర్ త్రైమాసికంలో అత్యంత తక్కువగా స్మార్ట్ ఫోన్ల విక్రయాలు పది శాతం తగ్గిందని ఐడీసీ వరల్డ్ వైడ్ క్వార్టర్లీ మొబైల్ ఫోన్ ట్రాకర్ రిపోర్ట్ తెలిపింది. డిమాండ్ బలహీన పడటానికి తోడు మొబైల్ ఫోన్ల ధరలు పెరగడం వల్ల పండుగల సీజన్లో ఫోన్ల విక్రయాలు పడిపోవడానికి కారణం అని పేర్కొంది.
వార్షిక ప్రాతిపదికన 2022లో స్మార్ట్ ఫోన్ల విక్రయాలు 8-9 శాతం తగ్గుముఖం పడతాయని ఐడీసీ అంచనా వేసింది. దాదాపు 150 మిలియన్ల ఫోన్ల విక్రయాలు జరుగుతాయని పేర్కొంది. వినియోగదారుల డిమాండ్పై వచ్చే ఏడాది ధరల పెరుగుదల పడిపోతుందని ఐడీసీ డివైజ్ రీసెర్చ్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ నవ్కేందర్ సింగ్ చెప్పారు. ధరలు పెరిగిపోవడంతోపాటు ఫీచర్ ఫోన్ల నుంచి స్మార్ట్ ఫోన్ల వాడకం దిశగా పరివర్తన తగ్గుముఖం పడుతుందని తెలిపారు. 4జీ నుంచి 5జీ స్మార్ట్ ఫోన్లకు మళ్లే వారిపై వచ్చే ఏడాది ధరల ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు.
మొత్తం ఫోన్ల విక్రయాల్లో మీడియాటెక్ బేస్డ్ స్మార్ట్ ఫోన్లు 47 శాతం వాటా కలిగి ఉంటే, క్వాల్కామ్ 25 శాతానికి, యూనిసోక్ 15 శాతానికి పరిమితమైంది. షియోమీ ఫోన్లు 21.2 శాతం సేల్ అయితే, ప్రీమియం కేటగిరీ మార్కెట్లో ఆపిల్ ఐఫోన్లు 68 శాతం వాటా కలిగి ఉన్నాయని ఐడీసీ పేర్కొంది. శ్యామ్సంగ్ 18.5 శాతంతో రెండో వాటా, వివో 14.6, రియల్ మీ 14.2, ఒప్పో 12.5 శాతం వాటా స్మార్ట్ ఫోన్లు విక్రయించాయని వివరించింది.