Apple | భారత్ మార్కెట్పై టెక్ దిగ్గజం ఆపిల్ సీఈవో టిమ్ కుక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ మార్కెట్ చాలా నమ్మకమైన, స్వీయ దృఢత్వం ( Very bullish on India ) కలిగి ఉందని పేర్కొన్నారు. `పెట్టుబడులు, రిటైల్, ఆన్లైన్ లావాదేవీలకు భారత్ చాలా ప్రోత్సాహకర మార్కెట్. భారత్లో వ్యాపార లావాదేవీల విస్తరణకు మేం గణనీయంగా ఫోకస్ చేస్తాం` అని చెప్పారు. `భారత్లో కొవిడ్ సమయం నుంచి మేం బాగా పని చేస్తున్నాం. ఇప్పుడు చాలా నమ్మకంతో, స్వీయ దృఢత్వంతో ఉన్నాం. భారత్లో బిజినెస్పై దృష్టి సారించాం. ఏడాదికేడాది డబుల్ డిజిట్స్ వృద్ధితో చాలా బలంగా మార్కెట్ పెంచుకుంటున్నాం. త్రైమాసిక రెవెన్యూలో రికార్డు నెలకొల్పాం. 2020లో భారత్లో ఆన్లైన్ స్టోర్ ఏర్పాటు చేశాం. త్వరలో ఆపిల్ రిటైల్ స్టోర్లు ఏర్పాటు చేస్తాం` అని తెలిపారు.
`అవరోధాలు ఉన్నా మేం బాగా పని చేస్తున్నాం. మాకు భారత్ చాలా ఉత్తేజకరమైన మార్కెట్. ప్రధాన దృష్టి భారత్పైనే ఉంటుంది` అని టిమ్ కుక్ చెప్పారు. డిసెంబర్ త్రైమాసికం ఫలితాల్లో 117.2 బిలియన్ డాలర్ల రెవెన్యూ సంపాదించినట్లు వెల్లడించారు. భారత్, బ్రెజిల్లతోపాటు కెనడా, ఇండోనేషియా, మెక్సికో, స్పెయిన్, టర్కీ, వియత్నాం వంటి దేశాల్లో తమ సంస్థ రెవెన్యూ ఆల్టైమ్ రికార్డులు నెలకొల్పిందన్నారు. 2021 డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే ఆపిల్ వార్షిక ఆదాయం ఐదు శాతం తగ్గింది. సవాళ్లు ఎదురైనా 2021లో దాదాపు 124 బిలియన్ డాలర్ల ఆదాయం లభించిందన్నారు టిమ్ కుక్.
మార్కెట్లో పరిస్థితుల అధ్యయనంపై చాలా దృష్టి సారించామని టిమ్ కుక్ తెలిపారు. వినియోగదారులు తమ ఫోన్లు, ఇతర గాడ్జెట్లు చౌకగా కొనుగోలు చేసేందుకు ఎక్కువ ఆప్షన్లు కల్పిస్తున్నట్లు చెప్పారు. వియత్నాం, భారత్తోపాటు పలు అభివృద్ధి చెందిన దేశాలు కెనడా, ఇటలీ, స్పెయిన్ వంటి మార్కెట్లలో ఐ-ఫోన్ సేల్స్ ఆల్టైం రికార్డు నెలకొల్పాయని ఆపిల్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్-సీనియర్ వైస్ ప్రెసిడెంట్ లుకా మైస్ట్రీ తెలిపారు.