NR Narayana Murthy | ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ ఎన్ఆర్ నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. `పూర్తిగా తప్పు` నిర్ణయం తీసుకున్నానని అన్నారు. ఇన్ఫోసిస్ ప్రమోటర్-ఫౌండర్ల వారసులను సంస్థలో చురుకైన పాత్ర పోషించడానికి అనుమతించకపోవడం తాను చేసిన తప్పేనన్నారు. బెంగళూరులో బుధవారం జరిగిన ఇన్ఫోసిస్ 40వ వార్షికోత్సవ వేడుకలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సంస్థ యాజమాన్య బాధ్యతల నిర్వహణకు సరైన వారసులను ముందుకు తేవాల్సిందన్నారు నారాయణ మూర్తి. అయితే నాటి తన నిర్ణయానికి సరైన కారణమే ఉందని చెప్పారు. `సంస్థ (ఇన్ఫోసిస్) భవితవ్యం గట్టిగా ఉండాలని నేను భావించా. ప్రతిభ లేనివారిని ముఖ్యమైన స్థానాల్లో నియమిస్తే నష్టం జరుగుతుందని భయపడ్డా` అని అన్నారు. ఎవరైనా ఉద్యోగికి సరైన బాధ్యత, హోదా కల్పించడానికి ముందు సరిగ్గా మదింపు జరుగాల్సి ఉందని అన్నారు.
`ఒక వ్యక్తి జాతీయత లేదా వారసత్వం లేదా ప్రమోటర్ ఫౌండర్ల పిల్లలు ఎవరైనా కావచ్చు. కానీ నాయకత్వ స్థానానికి చేరుకోవాలంటే మెరుగైన పోటీని ఎదుర్కోవాలి` అని నారాయణమూర్తి పేర్కొన్నారు. ఇన్ఫోసిస్ కో-ఫౌండర్, ప్రస్తుత నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నందన్ నిలేకని కూడా నారాయణమూర్తి వ్యాఖ్యలను సమర్థించారు. ఇన్ఫోసిస్ యాజమాన్య వారసత్వం ఖరారు చేయడానికి తనకూ ఎటువంటి ప్లాన్ లేదన్నారు. సరైన విలువలతో సంస్థను ముందుకు తీసుకెళ్లాలన్న నారాయణ మూర్తి విజన్కు అనుగుణంగా సంస్థ నాయకత్వ వ్యవస్థను రూపొందించామని తెలిపారు.
ఇన్ఫోసిస్ చైర్మన్గా అవసరమైనంత సుదీర్ఘకాలం కొనసాగుతానని నందన్ నిలేకని చెప్పారు. 1981లో ఏడుగురు ఇంజినీర్లు.. నారాయణ మూర్తి, నిలేకని, ఎస్ (క్రిష్) గోపాలకృష్ణన్, కే దినేష్, ఎస్డీ శిబూలాల్, ఎన్ఎస్ రాఘవన్, అశోక్ అరోరాలతో కలిసి రూ.10 వేల పెట్టుబడితో మొదలైందే ఈ ఇన్ఫోసిస్. ఇప్పుడు దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ సంస్థగా నిలిచింది.
వారసులను కంపెనీ యాజమాన్య బాధ్యతల్లోకి తీసుకు రాకూడదని కంపెనీ సహ-వ్యవస్థాపకుల మధ్య ఒక ఒక ఒప్పందం కూడా ఉంది. ప్రారంభం నుంచి ఇన్ఫోసిస్ సీఈవోగా నారాయణ మూర్తి దాదాపు 20 ఏండ్ల పాటు బాధ్యతలు నిర్వర్తించారు. 2002లో నందన్ నిలేకనీ సీఈవోగా, నారాయణమూర్తి చైర్మన్ కం చీఫ్ మెంటర్గా నియమితులయ్యారు. తదుపరి సీఈవోగా క్రిష్ గోపాలకృష్ణన్ పని చేశారు. 2011లో ఎస్డీ శిబూలాల్ సీఈవోగా నియమితులు కాగా, 2017లో విశాల్ సిక్కా బాధ్యతలు చేపట్టారు. కానీ, అనూహ్య పరిస్థితుల్లో 2017లోనే విశాల్ సిక్కా వైదొలగా, 2018లో ప్రస్తుత సీఈవో సలీల్ పరేఖ్ నియమితులయ్యారు.