న్యూఢిల్లీ : భారత్లో మహిళా గేమర్ల సంఖ్య పెరుగుతున్నదని, గేమింగ్ను ఫుల్ టైం ప్రొఫెషన్గా ఎంచుకునే ధోరణి కనిపిస్తోందని హెచ్పీ ఇండియా గేమింగ్ ల్యాండ్స్కేప్ స్టడీ 2022 అధ్యయనం వెల్లడించింది. గేమింగ్ కోసం స్మార్ట్ఫోన్ల కంటే పీసీలకే మొగ్గుచూపుతున్నారని సర్వేలో 69 శాతం మంది పీసీలకే ఓటేశారని అధ్యయనం తెలిపింది.
స్మార్ట్ఫోన్లతో పోలిస్తే పీసీలు మెరుగైన ప్రాసెసర్లు, డిజైన్, డిస్ప్లేలు కలిగిఉండటమే అడ్వాంటేజ్గా గేమర్లు చెబుతున్నారని సర్వే పేర్కొంది. ఈ ఏడాడి హెచ్పీ 14 నగరాల్లోని 2000 మందిని పలకరించడం ద్వారా ఈ సర్వేను చేపట్టింది. వీరిలో 60 శాతం మంది పీసీ యూజర్లు కాగా, 40 శాతం మంది మొబైల్ ఫోన్ యూజర్లున్నారు. ఈ సర్వేలో పాల్గొన్న 502 మంది మహిళల్లో గేమింగ్ను కెరీర్గా ఎంచుకోవచ్చని 27 శాతం మంది పేర్కొన్నారు.
39 శాతం మంది గేమింగ్ కెరీర్ ఆప్షన్ కాదని తేల్చిచెప్పగా ఐదు శాతం మంది ఎటూ తేల్చలేదు. గత ఏడాది సర్వే తరహాలోనే తాజా సర్వేలోనూ అత్యధిక మంది పీసీలపైనే గేమింగ్ మెరుగ్గా ఉంటుందని స్పష్టం చేశారు. ఇక గేమింగ్ను ఎంటర్టైన్మెంట్, రిలాక్సేషన్ సోర్స్గా 92 శాతం మంది పేర్కొనగా, మానసిక ఉల్లాసం అందిస్తుందని 58 శాతం మంది, సోషలైజింగ్కు ఉపయోగపడుతుందని 52 శాతం మంది చెప్పుకొచ్చారు. గేమర్స్ జర్నీలో హెచ్పీ యువతకు, యూజర్లకు తోడ్పాటు అందిస్తుందని హెచ్పీ ఇండియా మార్కెట్ సీనియర్ డైరెక్టర్ పర్సనల్ సిస్టమ్స్ విక్రమ్ బేడి పేర్కొన్నారు.