న్యూఢిల్లీ : ఈ ఏడాది సెప్టెంబర్లో భారత్లో ఐఫోన్ 14 ఫోన్లు లాంఛ్ కాగా, అప్పటి నుంచి వాటి లభ్యత తక్కువగా ఉంటోంది. ముఖ్యంగా రూ 1,20.000కు పైగా విలువైన ఐఫోన్ 14 ప్రొ, ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్ దేశంలో తగినంతగా అందుబాటులో లేవు. ఈ ఫోన్లను కొనుగోలు చేసినా వాటి డెలివరీకి వారాల తరబడి నిరీక్షించాల్సిన పరిస్ధితి నెలకొంది. ఈ అంశంపై భారత ప్రభుత్వం దృష్టి సారించింది.
భారత్లో ఐఫోన్ 14 సరఫరాలను మెరుగుపరిచే దిశగా చర్యలు చేపట్టాలని కోరుతూ ఐటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ యాపిల్తో సంప్రదింపులు జరిపారు. భారత్లో ఐఫోన్ 14 స్టాక్ కొరతపై ఇటీవల ఓ యూజర్ ట్విట్టర్లో ధ్వజమెత్తగా మంత్రి చంద్రశేఖర్ ఈ వివరాలు వెల్లడిస్తూ కామెంట్ చేశారు. తాను ఈ విషయమై యాపిల్తో మాట్లాడానని, భారత్లో ఉత్పత్తిని పెంచడంతో పాటు ఐఫోన్ 14 డిమాండ్ను అందుకోగలుగుతున్నామని కంపెనీ వెల్లడించిందని చెప్పారు.
ఐఫోన్ 14 ప్రొ డిమాండ్ అధికం కావడంతో సరఫరా సమస్యలు ఎదురయ్యాయని, వాటిని తాము పరిష్కరిస్తున్నామని తెలిపిందని మంత్రి ట్వీట్లో రాసుకొచ్చారు. మరోవైపు ఐఫోన్ 14 ప్రొ, ఐఫోన్ 14 సరఫరా సమస్యలపై యాపిల్ అధికారికంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. దివాళీ సందర్భంగా ఐఫోన్ 14 ప్రొ, ఐఫోన్ 14కు అసాధారణ డిమాండ్ నెలకొనడంతోనే సమస్యలు ఎదురయ్యాయని కంపెనీ వర్గాలు అనధికారికంగా చెబుతున్నాయి. చైనాలో కొవిడ్-19 కేసుల పెరుగుదలతో జీరో-కొవిడ్ పాలసీ అనుసరిస్తుండటంతో ఐఫోన్ల సప్లయి చైన్లో అవాంతరాలు ఏర్పడ్డాయని తెలుస్తోంది.