Sundar Pichai | ఇంటర్నెట్లో వాయిస్ ద్వారా వందకి పైగా భాషల `సెర్చింగ్` కోసం కసరత్తు చేస్తున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచ్చాయ్ తెలిపారు. ప్రపంచంలో ఎక్కువగా మాట్లాడే వెయ్యి భాషలను ఆన్లైన్ సెర్చింగ్లోకి తేవాలన్నదే తమ సంకల్పం అని అన్నారు. ఆ ప్రాజెక్టులో వందకిపైగా భారతీయ భాషలు చేర్చామన్నారు.
ఆన్లైన్లో వందల భాషల సెర్చింగ్ కోసం కృత్రిమ మేధస్సును వినియోగిస్తామని సుందర్ పిచ్చాయ్ చెప్పారు. ప్రజలు తమ భాషలోనే పరిజ్ఞానం, సమాచారం పొందేలా చేయడమే తమ ప్రాజెక్టు ముఖ్యోద్దేశం అని గూగుల్ ఫర్ ఇండియా కార్యక్రమంలో సుందర్ పిచ్చాయ్ వెల్లడించారు.
కృత్రిమ మేధస్సు (ఏఐ) కోసం ఐఐటీ-మద్రాస్తో కలిసి మల్టీ డిసిప్లినరీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు సుందర్ పిచ్చాయ్ పేర్కొన్నారు. భారతీయులు టెక్నాలజీ వినియోగించుకుంటున్న తీరు తనకు ఆశ్చర్యం కలిగిస్తున్నదన్నారు.
ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతున్నాయన్నారు సుందర్ పిచ్చాయ్. దేశీయంగా అత్యంత వేగంగా టెక్నాలజీ పరంగా పలు మార్పులు చోటు చేసుకోవడానికి ప్రధాని మోదీ డిజిటల్ ఇండియా విజన్ కారణం అని పేర్కొన్నారు.
వచ్చే పదేండ్ల కాలంలో అందరికి ఇంటర్నెట్ అందుబాటులోకి తెచ్చేందుకు 1000 కోట్ల డాలర్లతో చేపట్టిన ఇండియా డిజిటలైజ్ ఫండ్ (ఐడీఎఫ్) ఖర్చుతో సాధించిన పురోగతిని సమీక్షించడానికి భారత్కు వచ్చానని సుందర్ పిచ్చాయ్ అన్నారు.
భారత్ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ, ఐటీ టెలీ కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తదితరులతో భేటీ అయ్యారు. దేశ ప్రజలందరికీ డిజిటల్ వసతులు అందుబాటులోకి తేవడానికి కృషి చేయాలని సుందర్ పిచ్చాయ్ను ద్రౌపది ముర్ము కోరారు.