Google on CCI | ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ వ్యవస్థ అంశంపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విధించిన జరిమానాకు వ్యతిరేకంగా న్యాయస్థానం మెట్లెక్కాలని గూగుల్ యోచిస్తున్నది. అనైతిక వ్యాపార పద్ధతులు పాటిస్తున్నదంటూ గూగుల్ మీద సీసీఐ ఈ నెల 20న రూ.1,337.76 కోట్ల జరిమాన విధించింది. తర్వాత వారం కూడా తిరగక ముందే గూగుల్ ప్లే స్టోర్ విధానాల్లో పోటీ తత్వ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నదంటూ మరో రూ.936.44 కోట్ల ఫైన్ విధించింది. తక్షణం ఈ పద్దతులు మార్చుకోవాలని గూగుల్ను హెచ్చరించింది సీసీఐ. ఇలా భారత్లో సీసీఐ జరిమాన విధించడం.. చట్ట పరంగా ఇబ్బందులు ఎదురు కావడం గూగుల్కు తొలిసారి.
సీసీఐ నిర్ణయం వల్ల తమకు ఇతర దేశాల్లో ఒత్తిళ్లు తలెత్తే అవకాశాలు ఉన్నాయని గూగుల్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో త్వరలో సీసీఐ ఆదేశాలను న్యాయస్థానంలో సవాల్ చేయాలని భావిస్తున్నట్లు గూగుల్ వర్గాల కథనం. అధికారికంగా దీనిపై స్పందించేందుకు గూగుల్ ప్రతినిధులు నిరాకరించారు.
ఇంతకుముందు గూగుల్పై యూరోపియన్ యూనియన్ సుమారు రూ.3 కోట్ల జరిమాన విధించింది. ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్ల విషయంలో వాటి తయారీ కంపెనీలకు గూగుల్ పరిమితులు విధిస్తుందని ఈయూ కమిషన్ భారీ జరిమాన విధించింది. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించినా గూగుల్కు ఊరట లభించలేదు.