Sunder Pichai | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence)తో ముప్పు తప్పదని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ముప్పు నుంచి తప్పుకోవాలంటే కృత్రిమ మేధ టెక్నాలజీపై నియంత్రణ ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు. కనుక కృత్రిమ మేధను అందరికీ ప్రయోజనకరమైన మార్గంలో వినియోగించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వాలు తక్షణం దృష్టి సారించాలని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. సరిగ్గా ఉపయోగించుకోకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో హానికర పరిణామాలను ఎదుర్కోక తప్పదని హెచ్చరికలు జారీ చేశారు.
టెక్నాలజీలో చాలా వేగంగా మార్పులు వస్తున్నాయని సుందర్ పిచాయ్ అన్నారు. అత్యంత వేగంగా కొత్త టెక్నాలజీని సమాజానికి అందుబాటులోకి తేవడానికి టెక్నాలజీ కంపెనీలు పోటీ పడుతున్నాయని చెప్పారు. ఈ టెక్నాలజీ టూల్స్ను యూజర్లు తమకు అనువుగా మార్చుకునే సమయం కూడా దొరకడం లేదని అన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో అసత్య ప్రచారం రూపొందించే వీలు ఉందని సుందర్ పిచాయ్ హెచ్చరించారు. ఇది సమాజానికి ప్రమాదకరం అని స్పష్టం చేశారు. ఇలా పెరుగుతున్న కృత్రిమ మేధ టెక్నాలజీని నియంత్రించడానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రభుత్వాలు కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అణ్వాయుధాల నియంత్రణ మాదిరిగానే కృత్రిమ మేధ నియంత్రణ కార్యాచరణ ఉండాలన్నారు. దీని నియంత్రణకు ఒక కంపెనీ మాత్రమే నిర్ణయం తీసుకోలేదన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను తలుచుకుంటే నిద్ర లేని రాత్రులు గడపాల్సి వస్తుందని సుందర్ పిచాయ్ తేల్చి చెప్పారు. మానవ మేధస్సుతో తల పడుతూ కృత్రిమ మేధస్సుతో వస్తున్న చాట్జీపీటీ వంటివి వాటితో సమాజానికి, మానవాళికి తీవ్ర ముప్పు ఉందని ఇటీవల గ్లోబల్ టెక్ దిగ్గజ సంస్థల అధిపతులు, టెక్నాలజీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అడ్వాన్స్ చాట్జీపీటీ వ్యవస్థల అభివృద్ధిని తక్షణం నిలిపేయాలని కోరుతూ ఎలన్మస్క్ వంటి ప్రముఖులు బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే. పాజిటివ్ ఫలితాలిచ్చే ఏఐ వ్యవస్థలనే డెవలప్ చేయాలని, ప్రతికూల ప్రభావం తలెత్తినా వాటిని నియంత్రించే విశ్వాసం ఉంటేనే అడ్వాన్స్డ్ ఏఐ వ్యవస్థలను డిజైన్ చేయాలని వారు హితవు చెప్పారు.