ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం ముప్పు భయం టెక్నాలజీ సంస్థలను వెంటాడుతున్నది. పొదుపు చర్యల్లో భాగంగా టెలికం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్ ప్రపంచవ్యాప్తంగా 8500 కోట్ల మందిని తొలగించనున్నది. స్వీడన్లోనే దాదాపు 1400 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. టెక్నాలజీ కంపెనీలు వేల మందికి ఉద్వాసన పలికాయి. దేశాల వారీగా పరిస్థితులను బట్టి ఉద్వాసనలు ఉంటాయని ఎరిక్సన్ సీఈవో బొర్జే ఎక్హోల్మ్ తాజాగా జారీ చేసిన మెమోలో పేర్కొన్నారు. `పలు దేశాల్లోని యూనిట్లలో ఉద్వాసనల జాబితాను సంబంధిత ఉద్యోగులకు తెలియజేశాం` అని చెప్పారు.
హైస్పీడ్ ఇంటర్నెట్ కోసం భారత్లో 2000 ఉద్యోగాలు కల్పిస్తామని ఎరిక్సన్ గతేడాది ప్రకటించింది. కానీ, కొన్ని రోజులకే భారీగా ఉద్యోగాల తొలగింపునకు పూనుకోవడం గమనార్హం. భారత్లో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్లకు 5జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వసతుల కల్పన కాంట్రాక్ట్ను ఎరిక్సన్ పొందింది.
సెర్చింజన్ గూగుల్ ప్రపంచవ్యాప్తంగా ఆరు శాతం మంది ఉద్యోగులను.. అంటే దాదాపు 12 వేల మందిని తొలగిస్తున్నట్లు గత నెలలో ప్రకటించింది. గతేడాది 11 వేల మంది ఉద్యోగులను సాగనంపిన సోషల్ మీడియా దిగ్గజం మెటా.. వచ్చే నెలలో మరో 11 వేల మందికి పింక్ స్లిప్లు అందజేయనున్నట్లు సమాచారం. మైక్రోసాఫ్ట్, అమెజాన్ తదితర సంస్థలు కూడా వేలల్లో ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి.