Twitter-Elon Musk | మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ను టేకోవర్ చేయడానికి టెస్లా సీఈవో ఎలన్మస్క్ మళ్లీ ముందుకు వచ్చారు. ట్విట్టర్తో డీల్పై ఏరోజుకారోజు సర్ప్రైజ్లిస్తూనే ఉన్నారు. ప్రారంభంలో ఇచ్చిన ఆఫర్ ప్రకారం 44 బిలియన్ డాలర్ల ఒప్పందానికి ట్విట్టర్ టేకోవర్ కోసం ఎలన్మస్క్కు కొంత టైం కలిసి వచ్చింది. ఈ అంశంపై ట్విట్టర్ దాఖలు చేసిన పిటిషన్పై ఈ నెల 28న అమెరికా కోర్టులో విచారణ జరుగనున్నది. తొలుత ఈ పిటిషన్పై ఈ నెల 17న విచారణ జరుగాల్సి ఉంది. ట్విట్టర్ టేకోవర్ కోసం ప్రతిపాదించిన ఆఫర్తోనే డీల్ పూర్తి చేసేందుకు విచారణ తేదీ వాయిదా వేయాలని న్యాయస్థానాన్ని మస్క్ కోరారు.
తొలి ప్రతిపాదన మేరకే ట్విట్టర్ను టేకోవర్ చేస్తానని ఎలన్మస్క్ ప్రకటించినా.. తెర వెనుక మాత్రం తక్కువ ధరకు ట్విట్టర్ను విక్రయించాలని మస్క్ న్యాయవాదులు కొన్ని వారాలుగా సోషల్ మీడియా సంస్థ యాజమాన్యంతో చర్చలు జరిపారని సమాచారం. ఈ నెల 28న గానీ, ఆ లోపు గానీ ట్విట్టర్ టేకోవర్ డీల్ పూర్తవుతుందని ఎలన్మస్క్ భావిస్తున్నట్లు చెప్పారు. మస్క్ నుంచి ఆఫర్ వచ్చాకే డీల్ ముగుస్తుందని ట్విట్టర్ ప్రకటించింది.
తొలుత షేర్ 54.20 డాలర్ల చొప్పున 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్ను కొనుగోలు చేస్తానని ఎలన్మస్క్ ప్రతిపాదించారు. తదుపరి స్పామ్ ఖాతాలపై ట్విట్టర్ పారదర్శకంగా వ్యవహరించనంత కాలం టేకోవర్ డీల్పై ప్రతిష్ఠంభన కొనసాగుతుందని పేర్కొన్నారు. చివరిగా జూలై 8న ట్విట్టర్ డీల్ నుంచి వైదొలిగినట్లు ప్రకటించారు. దీనిపై ట్విట్టర్ న్యాయ పోరాటానికి దిగింది.
ట్విట్టర్ టేకోవర్ డీల్ను పూర్తి చేయడానికి ఎలన్మస్క్కు పెద్ద అవరోధాలు ఉన్నాయి. ఈ డీల్ కోసం 12.5 బిలియన్ డాలర్ల రుణం తీసుకోవాల్సిన పరిస్థితుల్లో మస్క్ ఉన్నారు. బిలియన్ డాలర్ల నిధుల సేకరణ కోసం ఈక్విటీ ఇన్వెస్టర్ల గ్రూప్ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ట్విట్టర్ డీల్ ఖరారు చేసుకోవాలంటే అందుకు అవసరమైన నిధులను మస్క్ సమకూర్చుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.