e-Passport: పలు దేశాలు ఎప్పటినుంచో అమలు చేస్తున్న ఈ-పాస్పోర్ట్ ను ఇటీవల ఇండియా కూడా అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా పాస్పోర్ట్ జారీ ప్రక్రియ సులభం అవుతుంది. అలాగే.. ఎయిర్ పోర్టుల్లో వేగంగా స్కానింగ్, తనిఖీ చేయడానికి వీలవుతుంది. పాస్పోర్ట్ సేవా ప్రోగ్రామ్ 2.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఈ-పాస్పోర్ట్ ను ప్రవేశపెట్టగా ఇప్పటికే ఇండియాలో ఉంటున్న 80 లక్షల మందికి, విదేశాల్లో ఉంటున్న 62 వేల మందికి జారీ చేశారు.
ఈ-పాస్పోర్ట్ అంటే ఏంటి..
ఇది కూడా సాధారణ పాస్పోర్ట్ లాంటిదే. అయితే, ఇది ఎలక్ట్రానిక్ డివైజ్ ఆధారంగా పని చేస్తుంది. ఈ పాస్పోర్ట్ బ్యాక్ కవర్లో ఒక చిప్ ఉంటుంది. ఈ చిప్ లో పాస్పోర్ట్ దారుడి బయోమెట్రిక్ వివరాలు.. అంటే ఫింగర్ ప్రింట్స్, ఫేసియల్ రికగ్నిషన్, డిజిటల్ సైన్ వంటివి ఉంటాయి. పైగా ఈ చిప్ ను ట్యాంపర్ చేయడానికి వీల్లేదు. ఎయిర్ పోర్టుల్లో సాధారణంగా పాస్పోర్ట్ బుక్ ను పరిశీలిస్తారు. అందులో ఫొటో, సంతకం వంటివి సిబ్బంది తనిఖీ చేస్తారు. వాటిని సరిచూసుకోవడానికి చాలా సమయం పడుతుంది. అయితే, ఈ-పాస్పోర్ట్ ద్వారా అలా స్కాన్ చేయగానే పూర్తి వివరాలు డిజిటల్ స్క్రీన్ పై ప్రత్యక్షమవుతాయి. దీంతో సంబంధిత వ్యక్తిని పోల్చుకోవడం, స్కానింగ్ చేయడం సులభమవుతుంది. ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ వేగంగా పూర్తవుతుంది. ఈ-పాస్పోర్ట్ డాక్యుమెంట్ వెనుక భాగంలో ఒక గోల్డ్ కలర్ సింబల్ ఉంటుంది. దీని ద్వారా ఇది చిప్ ఎనేబుల్డ్ పాస్పోర్ట్ అని గుర్తించవచ్చు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి
భారతీయులు ఎవరైనా సరే.. ఈ-పాస్పోర్ట్ కు కూడా సాధారణ పాస్పోర్ట్ లాగే దరఖాస్తు చేసుకోవాలి. 36 పేజీల బుక్ లెట్ కోసం రూ.1,500, 60 పేజీల బుక్ లెట్ కోసం రూ.2,000 చెల్లించాలి. దీని దరఖాస్తు కోసం ప్రత్యేక కేటగిరి అంటూ ఏమీ లేదు. ప్రస్తుతం ఈ-పాస్పోర్ట్ సేవ కొన్ని కేంద్రాల్లోనే అందుబాటులో ఉంది. త్వరలోనే మరిన్ని కేంద్రాలకు ఈ సేవను విస్తరించనుంది. కొత్తగా దరఖాస్తు చేసుకునేవారితోపాటు, రెన్యువల్ చేసుకునేవాళ్లు కూడా ఈ-పాస్పోర్ట్ పొందొచ్చు.