ChatGPT | ఇప్పుడంతా టెక్నాలజీ మయం.. టెక్నాలజీ టూల్స్లో సంచలనాలు క్రియేట్ అవుతున్నాయి. తాజాగా ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ సెక్టార్లో చాట్ జీపీటీ ( ChatGPT ) తనకంటూ ఒక అరుదైన రికార్డు నమోదు చేసుకున్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారంగా ఈ యాప్ పని చేస్తుంది. ఈ యాప్ ఆధ్వర్యంలో నడుస్తున్న చాట్ బోట్ కేవలం రెండు నెలల్లో 10 కోట్ల మంది యూజర్లను సొంతం చేసుకున్నది. ఇది ప్రపంచదేశాల్లోనే వేగంగా విస్తరిస్తున్న యాప్గా నిలిచింది.
గత జనవరిలో చాట్జీపీటీలో 1.3 కోట్ల మంది యూజర్లు పేర్లు నమోదు చేసుకున్నారు. సోషల్ మీడియా యాప్స్ ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ వంటి యాప్లను కూడా దాటేసి అతి తక్కువ టైంలో 10 కోట్ల యూజర్ల మైలురాయికి చేరుకున్నది. ఇంతకుముందు ఇతర యాప్లు 10 కోట్ల మంది యూజర్ల దరి చేరడానికి రెండున్నరేండ్లకు పైగా సమయం పట్టిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2022 డిసెంబర్లోనే చాట్జీపీటీ వెలుగులోకి వచ్చింది. టెస్లా కం ట్విట్టర్ సీఈవో ఎలన్మస్క్ కూడా చాట్ జీపీటీ పేరెంట్ సంస్థ ఓపెన్ ఏఐలో పెట్టుబడులు పెట్టారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పని చేసే ఈ చాట్ బోట్.. తన యూజర్కు అవసరమైన డేటా ఖచ్చితమైన వివరాలతో అందిస్తుంది. ఇందువల్లే సేవలందిస్తున్న అనతి కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. ఇప్పటివరకు గత 20 ఏండ్లలో ఇంత స్పీడ్గా కస్టమర్లకు చేరువైన యాప్ మరొకటి లేదని యూబీఎస్ రీసెర్చ్ తెలిపింది. గత వారంలో రోజుకు 2.5 కోట్ల మంది యూజర్లు ఈ వెబ్సైట్ను వినియోగించారని తెలిసింది. గత నెల 31న రికార్డ్ స్థాయిలో 2.8 కోట్ల మంది యూజర్లు ఈ డేటా వాడుకున్నారని సిమిలర్వెబ్ చెబుతున్నది. సాధారణంగా ప్రతి రోజూ 1.57 కోట్ల మంది యూజర్లు ఈ యాప్ వాడుతున్నారు.
చాట్ జీపీటీ వాడకం పెరిగిపోతే గూగుల్, ఇతర ఇంటర్నెట్ జెయింట్స్ ప్రగతి ఆందోళనకరంగా మారుతుందని వార్తలొస్తున్నాయి. అందువల్లే తామూ సెర్చింజన్లో చాట్బోట్ తరహా సర్వీసులు అందుబాటులోకి తెస్తామని గూగుల్ సీఈవో సుందర్ పిచ్చాయ్ వెల్లడించారు. చైనాలోని బైడూ సైతం స్వంతంగా చాట్ జీపీటీ టూల్ డెవలప్ చేస్తామని ఇప్పటికే ప్రకటించింది.