న్యూఢిల్లీ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాకతో కొలువుల కోత తప్పదనే ఆందోళన వ్యక్తమవుతున్న క్రమంలో ఏఐతో కొన్ని ఉద్యోగాలు కనుమరుగవుతాయని ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్న చాట్జీపీటీ (ChatGPT) క్రియేటర్ సామ్ అల్ట్మన్ పేర్కొన్నారు. ఏఐతో కొన్ని ఉద్యోగాలు పోతాయని, అయితే న్యూ టెక్నాలజీతో కొన్ని కొత్త ఉద్యోగాలూ అందుబాటులోకి వస్తాయని చెప్పారు.
ప్రతి టెక్నాలజీ విప్లవంతో ఉపాధి రంగంలో మార్పులు ఉండటం సహజమేనని తెలిపారు. గత రెండు తరాలుగా మనం కార్మిక మార్కెట్లో మార్పులను అందిపుచ్చుకున్నామని, న్యూ టెక్నాలజీతో మెరుగైన నూతన ఉద్యోగాలూ అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఏఐ విషయంలోనూ ఇదే జరుగుతుందని స్పష్టం చేశారు.
ఏఐ నియంత్రణపైనా సామ్ అల్ట్మన్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏఐ రెగ్యులేషన్ అవసరమని పేర్కొంటూ ఈ దిశగా ఏఐ నియంత్రణకు ఓపెన్ఏఐ ప్రభుత్వానికి సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ఏఐ రెగ్యులేషన్పై చిన్న కంపెనీలు కలత చెందాల్సిన అవసరం లేదని, దిగ్గజ కంపెనీలకు ఇది కీలకమని అల్ట్మన్ పేర్కొన్నారు. భారత్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సహా పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులను అల్ట్మన్ కలిసి సంప్రదింపులు జరపనున్నారు.
Read More