ChatGPT | టెక్నాలజీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్ ఆధారిత చాట్జీపీటీ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. కేవలం ఐదు నెలల్లోనే సెర్చింజన్ గూగుల్తో పోటీ పడుతూ నెటిజన్లకు అవసరమైన డేటా అందిస్తున్న చాట్జీపీటీ తరహా చాట్బోట్ల వల్ల ఆర్థికంగా భారం తగ్గడంతోపాటు ప్రొడక్షన్ పెరిగేందుకు అవకాశం ఉందని కార్పొరేట్ సంస్థలు భావిస్తున్నాయి. మరోవైపు, విద్యార్థులు తమకు అవసరమైన సబ్జెక్ట్లపై నాలెడ్జ్ కోసం చాట్జీపీటీని ఉపయోగించుకుంటున్నారు.
ఈ తరుణంలో సెర్చింజన్ గూగుల్తోపాటు మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజ సంస్థలన్నీ కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత చాట్జీపీటీ సేవలు అందించడానికి పోటాపోటీగా దూసుకెళ్తున్నాయి. సొంతంగా టూల్స్ తయారు చేయడంతోపాటు ఇతర సంస్థల్లోనూ పెట్టుబడులు పెడుతున్నాయి. కానీ, ఏఐ ఆధారిత చాట్జీపీటీ తరహా చాట్బోట్లతో సమీప భవిష్యత్లో మానవాళి మనుగడకే ముప్పు వాటిల్లుతుందని.. తక్షణం అడ్వాన్స్ చాట్ జీపీటీ వ్యవస్థలను అభివృద్ధి చేయడం నిలిపేయాలని ట్విట్టర్-టెస్లా సీఈవో ఎలన్మస్క్ పహా దాదాపు 1000 మంది టెక్ నిపుణులు ‘పాజ్ జియాంట్ ఏఐ ఎక్స్పెరిమెంట్స్’ అనే పేరుతో ఓ బహిరంగ లేఖ రాశారు.
ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం ముప్పు నుంచి తప్పించుకునేందుకు పొదుపు చర్యల్లో భాగంగా లేఆఫ్లు ప్రకటించాయి. వేల కొద్దీ ఉద్యోగులను ఇండ్లకు సాగనంపాయి. ఇలా ఉద్వాసనకు గురైన వారి స్థానే టెక్ దిగ్గజ సంస్థలన్నీ సమీప భవిష్యత్లో కృత్రిమ మేధ ఆధారిత చాట్ జీపీటీ చాట్బోట్లతో భర్తీ చేస్తాయోమోనన్న భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. మున్ముందు ఉద్యోగాలు నిలుపుకోవాలంటే టెక్నాలజీతోపాటు తమ నైపుణ్యం అప్డేట్ చేసుకోవాలని ఐటీ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో చాట్జీపీటీ వాడకంపై పలు దేశాలు సమీక్షించాయి. ఇటలీ వంటి దేశాలు నిషేధించాయి కూడా.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టెక్నాలజీ వినియోగం సమాజానికే ముప్పు అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. ఏఐ వాడకంపై శాస్త్రీయ సలహాదారులు, ఏఐ నిపుణులతో సమీక్ష తర్వాత మాట్లాడుతూ తమ దేశంలో ఏఐ టూల్స్ వినియోగానికి ఎటువంటి చట్టబద్ధత లేదన్నారు. కానీ, ఏఐ వినియోగంపై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఎన్ఐఎస్టీ) మాత్రం ఐటీ కంపెనీలకు సూచనలు చేస్తుందన్నారు. చాట్ జీపీటీ అభివృద్ధి చేస్తున్న ఓపెన్ ఏఐకి వ్యతిరేకంగా అమెరికాలో కేసులు నమోదయ్యాయి.
ఈయూ సభ్య దేశాలు ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత చాట్ జీపీటీ వాడకంపై విధి విధానాల తయారీలో నిమగ్నం అయ్యాయి. చాట్ జీపీటీ టూల్… ఈయూ జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ (జీడీపీఆర్)ను ఉల్లంఘిస్తుందా? అని ఈయూ సభ్య దేశాలు విచారణ జరుపుతున్నాయి. ఇటలీ నిషేధించగా, 27 దేశాలు కఠిన నిబంధనలు రూపొందించాయి. డేటా సేఫ్టీకి ప్రాధాన్యం ఇస్తున్నాయి. జర్మనీ కూడా ఏఐ ఆధారిత టూల్స్పై నిషేధం విధించాలని డిమాండ్ చేసింది. బ్రిటన్ కూడా దీనిపై గైడ్లైన్స్ తయారు చేస్తున్నది. తద్వారా ఐటీ కంపెనీలు సేఫ్టీగా, ట్రాన్స్పరెంట్గా ఉంటాయని బ్రిటన్ భావిస్తున్నది. ఈయూ సభ్య దేశాల ఆంక్షల వెనుక టెక్ దిగ్గజం ఆపిల్ వ్యూహం ఉందన్న అనుమానాలు ఉన్నాయి.
ఇప్పటికే ఏఐ బేస్డ్ చాట్జీపీటీ టూల్స్ను చైనా నిషేధించింది. ఈ టూల్స్ను అమెరికా దుర్వినియోగం చేస్తుందని అనుమానిస్తున్నది. సొంతంగా ఏఐ బేస్డ్ చాట్జీపీటీ తరహా టూల్ అభివృద్ధి చేస్తున్నది. ఇక ఉక్రెయిన్పై యుద్ధం వల్ల దేశంలో ఇంటర్నెట్ వినియోగంపై రష్యా బ్యాన్ విధించింది. కానీ, అమెరికాలోని సంస్థలు సైబర్ దాడులకు ఈ టూల్స్ను ఉపయోగించే అవకాశం ఉందని ఆందోళనకు గురవుతున్నది.
సొంతంగా ఏఐ ఆధారిత చాట్జీపీటీ టూల్ అభివృద్ధి చేసే ఆలోచన ఉందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇటీవల తెలిపారు. టెక్నాలజీ రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నామని, త్వరలోనే చాట్జీపీటీ తరహా టూల్ డెవలప్మెంట్పై ఓ ప్రకటన చేస్తామన్నారు. కానీ, ఏఐ వాడకానికి కేంద్రం ఎటువంటి నిబంధనలు అమలు రూపొందించలేదు. నీతి ఆయోగ్ మాత్రం కృత్రిమ మేధ వినియోగానికి జాతీయ వ్యూహం (ఎన్ఎస్ఏఐ) అనే పేరుతో గైడ్లైన్స్ తయారు చేసింది.