న్యూఢిల్లీ : భారత్లో 5జీ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశం 5జీ స్పెక్ట్రం వేలానికి టెలికాం శాఖకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ప్రజలు, వాణిజ్య సంస్ధలకు 5జీ సేవలు అందించే బిడ్డర్లకు 5జీ స్పెక్ట్రంను టెలికాం శాఖ కేటాయిస్తుంది. ప్రస్తుత 4జీ సేవలతో పోలిస్తే 5జీ సేవలు పది రెట్లు వేగం, సామర్ధ్యం కలిగిఉంటాయని క్యాబినెట్ పేర్కొంది.
20 ఏండ్ల వ్యాలిడిటీతో మొత్తం 72097.85 ఎంహెచ్జడ్ స్పెక్ట్రమ్ను జులై మాసాంతానికి వేలం ప్రక్రియ ముందుంచుతారు. భారత్ 5జీ ఎకోసిస్టంలో భాగంగా స్పెక్ట్రం వేలాన్ని ప్రకటిస్తున్నామని కేంద్ర టెలికాం, ఐటీ కమ్యూనికేషన్ల మంత్రి అశ్వని వైష్ణవ్ పేర్కొన్నారు. 2021 సెప్టెంబర్లో ప్రకటించిన టెలికాం రంగ సంస్కరణల ప్రకారం వేలంలో స్పెక్ట్రం దక్కించుకున్న ప్రొవైడర్లు ఎలాంటి స్పెక్ట్రం యూసేజ్ చార్జీలు విధించరు.
టెలికాం నెట్వర్క్ల నిర్వహణ వ్యయానికి సంబంధించి ఇది సర్వీస్ ప్రొవైడర్లకు ఊరటగా భావిస్తున్నారు. వేలంలో విజయవంతమైన బిడ్డర్ల నుంచి తొలిసారిగా అప్ఫ్రంట్ పేమెంట్ వసూలు చేయడం లేదని క్యాబినెట్ స్పష్టం చేసింది. ప్రతి ఏడాది ఆరంభంలో స్పెక్ట్రం చెల్లింపులను ముందస్తుగా 20 సమాన వాయిదాల్లో చెల్లించాలని ప్రభుత్వం అధికారిక ప్రకటనలో తెలిపింది. పదేండ్ల తర్వాత ఎలాంటి బకాయిలు లేకుండా స్పెక్ట్రంను తిరిగి స్వాధీనం చేసే వెసులుబాటు బిడ్డర్లకు కల్పిస్తారని పేర్కొంది.