Cervical Cancer | క్యాన్సర్లు ప్రాణాంతకమైనవి. ప్రాథమిక దశలో గుర్తించడం ద్వారా ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చునని వైద్యులు సూచిస్తున్నారు. మన దేశంలో మహిళలు ఎక్కువగా గర్భాశయ క్యాన్సర్ బారిన పడుతున్నారు. గర్భాశయ క్యాన్సర్ను తొలి దశలో గుర్తించడం సాధ్యం కాకపోవచ్చు. లక్షణాలు బయటపడేందుకు చాలా సమయం పడుతుంది. అయితే, కొన్ని లక్షణాలు ముందస్తుగా కనిపించగానే గర్భాశయ క్యాన్సర్గా అనుమానించి వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకుని నిర్ధారించుకోవాలి.
ఈ నేపథ్యంలో బెనారస్ హిందూ యూనివర్శిటీ (బీహెచ్యూ) శాస్త్రవేత్తలు ఈ గర్భాశయ క్యాన్సర్కు సంబంధించి శుభవార్తను వెల్లడించారు. గర్భాశయ క్యాన్సర్ కణాలను మైక్రో ఆర్ఎన్ఏ చేత చంపేయవచ్చునని కనుగొన్నారు. ఈ అధ్యయనం ఫలితాలు క్యాన్సర్ రంగంలో ప్రతిష్టాత్మకమైన జర్నల్ బీఎంసీ క్యాన్సర్లో ప్రచురితమైంది. ఈ శాస్త్రవేత్తల బృందం అధ్యయనం గర్భాశయ క్యాన్సర్ చికిత్సకు సురక్షితమైన మైక్రో ఆర్ఎన్ఏ థెరపీగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. ఈ థెరపీని అందుబాటులోకి తీసుకువస్తే గర్భాశయ క్యాన్సర్ ఎదుర్కొంటున్న మహిళలకు చికిత్స అందించడం కొంత సులువవుతుందని చెప్పవచ్చునంటున్నారు వైద్య నిపుణులు.
పీహెచ్డీ స్కాలర్ గరిమా సింగ్తో పాటు డాక్టర్ సమరేంద్ర కుమార్ సింగ్.. వైరల్ జన్యువు (E6) ను మానవ మైక్రోఆర్ఎన్ఎ (miR-34a) ద్వారా అణచివేయవచ్చని గుర్తించారు. ఇది ఆంకోజెనిక్ సెల్ సైకిల్ ఫ్యాక్టర్ను ఆఫ్ చేయడం ద్వారా క్యాన్సర్ కణాలను మాత్రమే చంపేస్తుందని వీరు కనుగొన్నారు. ప్రస్తుతం గర్భాశయ క్యాన్సర్ చికిత్సలో కీమోథెరపీ, రేడియోథెరపీ అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ చికిత్స హానికరమైన, విషపూరితమైన సాధారణ లేదా క్యాన్సర్ కానటువంటి కణాలను కూడా ప్రభావితం చేస్తుంది. గర్భాశయ క్యాన్సర్లకు నిర్దుష్ట క్యూరింగ్ థెరపీని అభివృద్ధి చేయడంలో ఈ అధ్యయనం ప్రధానమైందని డాక్టర్ సమరేంద్ర కుమార్ సింగ్ తెలిపారు.