న్యూఢిల్లీ : దేశంలోని కొన్ని నగరాల్లో ఈనెలలో 5జీ సర్వీసులు ప్రారంభం కాగా రానున్న రోజుల్లో పలు నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశవ్యప్తంగా 200కి పైగా నగరాలు, పట్టణాలకు 5జీ సర్వీసులను విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ పేర్కొన్నారు.
ఆపై చిన్న పట్టణాలు, గ్రామాలు, మారుమూల ప్రాంతాలకు సైతం హైస్పీడ్ నెట్వర్క్ విస్తరిస్తుందని అన్నారు. తొలుత 13 ప్రధాన నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయని అంతకుముందు టెలికాం శాఖ (డీఓటీ) వెల్లడించింది.
రిలయన్స్ జియో కేవలం ఢిల్లీ, ముంబై, కోల్కతా, వారణాసి వంటి నాలుగు నగరాల్లోనే 5జీ సేవలు షురూ చేసింది. మరోవైపు ఎయిర్టెల్ ముంబై, బెంగళూర్, హైదరాబాద్, గురుగ్రాం, కోల్కతా, ఢిల్లీ, వారణాసి, చెన్నై నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించింది. అయితే వొడాఫోన్ ఐడియా 5జీ సర్వీసుల గురించి ఎలాంటి వివరాలు వెల్లడి కాలేదు.