Do Not Disturb | మొబైల్ ఫోన్ వినియోగదారులు ఎదుర్కొనే కామన్ సమస్య.. స్పామ్ కాల్స్. రోజూ తెలిసిన వాళ్ల నుంచి వచ్చే కాల్స్ కంటే కూడా కస్టమర్ కేర్ నంబర్ల నుంచి వచ్చే ఫోన్లే ఎక్కువగా ఉంటాయి. వీటి బాధ తట్టుకోలేకనే డు నాట్ డిస్ట్రబ్ సర్వీస్ను తీసుకొచ్చారు. కస్టమర్ కేర్ నంబర్ల నుంచి వచ్చే వేధింపులను తట్టుకోలేక చాలామంది డు నాట్ డిస్ట్రబ్ యాక్టివేట్ చేసుకున్నారు. అలా డీఎన్డీ సర్వీస్ యాక్టివేట్ చేసుకున్నా కూడా పెద్ద లాభమేమీ లేదట. డీఎన్డీ యాక్టివేట్ చేసుకున్న తర్వాత కూడా అవాంఛిత కాల్స్ వస్తూనే ఉన్నాయని తాజా సర్వేలో వెల్లడైంది.
డీఎన్డీ యాక్టివేట్ చేసుకున్న తర్వాత కూడా 92 శాతం మందికి రోజులో కనీసం ఒక్కసారైనా కస్టమర్ కేర్ నుంచి కాల్స్ వస్తున్నాయని ఈ సర్వేలో వెల్లడైంది. దీనికోసం దేశంలోని 342 జిల్లాల్లోని 11,157 మంది మొబైల్ వినియోగదారులపై ఆన్లైన్ విధానం ద్వారా లోకల్ సర్కిల్స్ అనే ఆన్లైన్ సంస్థ ఈ సర్వే నిర్వహించింది. జనవరి 5 నుంచి ఫిబ్రవరి 5 వరకు ఈ సర్వే నిర్వహించారు. ఇందులో 56వేల స్పందనలను తీసుకున్నారు. వీటన్నింటినీ విశ్లేషించిన అనంతరం ఆ సర్వే వివరాలను వెల్లడించారు. దీని ప్రకారం 15,040 మందిలో 92 శాతం మంది వినియోగదారులు రోజులో కనీసం ఒక్క సారైనా స్పామ్ కాల్స్ రిసీవ్ చేసుకుంటున్నారు. 11,157 మంది మొబైల్ సబ్స్క్రైబర్లలో 66 శాతం మంది ఒక రోజులో సరాసరిగా మూడు కంటే ఎక్కువ అవాంఛిత కాల్స్ పొందుతున్నారు. 16 శాతం మందికి 6 నుంచి 10 స్పామ్ కాల్స్ వస్తున్నాయి. 5 శాతం మంది అయితే 10 కంటే ఎక్కువ అవాంఛిత కాల్స్ను రిసీవ్ చేసుకుంటున్నారు.
ఫైనాన్షియల్ సర్వీసులు, రియల్ ఎస్టేట్ సెక్టార్ల నుంచి అవాంఛిత కాల్స్ను రిసీవ్ చేసుకుంటున్నామని 78 శాతం మంది సమాధానం చెప్పారు. వీటిలో సగం కాల్స్ కంపెనీ నంబర్ల నుంచి కాకుండా వ్యక్తిగత నంబర్ల నుంచే వస్తున్నాయని తెలిపారు. 29 శాతం కాల్స్ కంపెనీలకు సంబంధించిన మొబైల్ నంబర్స్ నుంచి వస్తున్నాయి. 14 శాతం కాల్స్ మాత్రమే ల్యాండ్లైన్ నంబర్ల నుంచి వస్తున్నాయి.