IPhone Ultra | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శాంసంగ్ (Samsung), చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీతో తల పడేందుకు ఆపిల్ -ఐఫోన్ సిద్ధం అవుతున్నది. త్వరలో ఆల్ట్రా బ్రాండ్ ఐ-ఫోన్ను మార్కెట్లోకి తేవాలని ఆపిల్ తలపోస్తున్నది. మెరుగైన హార్డ్వేర్-కెమెరా ఫీచర్లతో ప్రపంచ మార్కెట్లో ఆల్ట్రా- బ్రాండ్ ఫోన్లను ఆవిష్కరించిన తొలి స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ (Samsung). మూడేండ్ల క్రితం 2020లో గెలాక్సీ ఎస్20 ఆల్ట్రా పేరుతో శాంసంగ్ (Samsung) మార్కెట్లోకి తెచ్చింది. అటుపై గెలాక్సీ నోట్ 20 ఆల్ట్రా 5జీ ఆవిష్కరించిన శాంసంగ్(Samsung).. తదుపరి ఎస్ సిరీస్తో నోట్ను మెర్జ్ చేసి.. గెలాక్సీ ఎస్22 ఆల్ట్రాను తీసుకొచ్చింది.
శాంసంగ్(Samsung)కు పోటీగా చైనా స్మార్ట్ ఫోన్ జెయింట్ షియోమీ (Xiaomi) జత కలిసింది. 2021లో `ఎంఐ 11 ఆల్ట్రా` ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఇటీవలే షియోమీ(Xiaomi) 12ఎస్ ఆల్ట్రా ఫోన్ను ఆవిష్కరించింది. `ప్రో` మోడల్ ఫోన్ల కంటే యూజర్లకు ఆకర్షణీయంగా ఉండటంతో ఆపిల్ సైతం వచ్చే ఏడాది.. అంటే 2024లో సొంతంగా `ఆల్ట్రా` మోడల్ ఫోన్ మార్కెట్లోకి తెస్తున్నట్లు సంకేతాలిచ్చింది. ఈ మేరకు ఆపిల్ యాజమాన్యం అంతర్గతంగా చర్చించినట్లు సమాచారం.
ఇప్పటి వరకు ఆపిల్ తీసుకొచ్చిన `ప్రో` బ్రాండెడ్ ఫోన్ల కంటే `ఆల్ట్రా` బ్రాండ్ హయ్యర్-ఎండ్ ఐఫోన్గా నిలువనున్నదని భావిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఐ-ఫోన్ 14 ప్రో మ్యాక్స్ కంటే ఎక్కువ ధర పలుకుతుందని చెబుతున్నారు. సంస్థ డిసెంబర్ త్రైమాసికం ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా ఆపిల్ సీఈవో టిమ్కుక్ ఈ మేరకు సంకేతాలిచ్చారు. కస్టమర్లు తమ జీవనంలో భాగమైన `ఐఫోన్`లో మరిన్ని ఫీచర్ల కోసం మనీ ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆల్ట్రా ఐఫోన్లో ఫాస్టర్ ప్రాసెసర్తోపాటు బిగ్ డిస్ప్లే ఆప్షన్ కూడా ఉంటుందని అంచనా వ్యక్తం అవుతున్నాయి.
ఇక ఈ ఏడాది మార్కెట్లోకి రానున్న ఐఫోన్15 సిరీస్లోనూ కెమెరా మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయని టెక్ మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆప్టికల్ జూమ్ మెరుగు పరిచేందుకు కెమెరాలో పెరిస్కోమ్ లెన్స్ ఆఫర్ చేయొచ్చునని తెలుస్తున్నది.