న్యూఢిల్లీ : భారత్లో 2022 నాలుగో క్వార్టర్లో 20 లక్షలకు పైగా ఐఫోన్లను యాపిల్ విక్రయించింది. ఈ క్వార్టర్లో 18 శాతం వృద్ధి సాధించిన యాపిల్ గత ఏడాదితో పోలిస్తే 11 శాతం వృద్ధి సాధించింది. ఇక గత ఏడాది యాపిల్ ఐఫోన్ 48 శాతం వృద్ధి సాధించగా అప్పట్లో 4.4 శాతం మార్కెట్ వాటాను కలిగిఉంది.
ఈసారి యాపిల్ ఐఫోన్స్ భారత మార్కెట్ వాటా 5.5 శాతానికి పెరిగిందని లేటెస్ట్ సీఎంఆర్ నివేదిక వెల్లడించింది. డిసెంబర్ క్వార్టర్లో భారత్ నుంచి 100 కోట్ల డాలర్ల విలువైన ఐఫోన్లను యాపిల్ ఎగుమతి చేసింది. 2022 సంవత్సరాంతానికి ప్రపంచవ్యాప్తంగా తయారైన ఐఫోన్లలో 15 శాతం భారత్ నుంచి ఉత్పత్తి అయ్యాయి.
ఇక డిసెంబర్ క్వార్టర్లో యాపిల్ ఐఫోన్ సిరీస్ 32 శాతం వృద్ధి నమోదు చేసింది. భారత్ నుంచి 45 శాతం ఐఫోన్లను ఎగుమతి చేయాలని యాపిల్ భావిస్తోంది. 2025 నాటికి ప్రతి నాలుగు ఐఫోన్లలో ఒకటి భారత్లో తయారైనదే ఉండాలని కంపెనీ లక్ష్యంగా నిర్ధేశించుకుంది. యాపిల్ ప్రస్తుతం భారత్లో ఐఫోన్ 12, ఐఫోన్ 13, ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ను భారత్లో ఉత్పత్తి చేస్తోంది.