న్యూఢిల్లీ : యాపిల్ (Apple) తన అప్కమింగ్ ఐఫోన్ 16 సిరీస్ బ్యాటరీలు భారత్లో తయారుకావాలని టెక్ దిగ్గజం యాపిల్ కోరుకుంటోంది. చైనా నుంచి తయారీ కార్యకలాపాలను భారత్కు తరలిస్తూ మేకిన్ ఇండియా ప్రోగ్రాంలో భారీ పెట్టుబడుల దిశగా యాపిల్ సన్నాహాలు చేపట్టింది. భారత్లో నూతన ఫ్యాక్టరీలు నిర్మించాలని చైనాకు చెందిన డీసే, తైవాన్కు చెందిన సింప్లో టెక్నాలజీలను యాపిల్ కోరినట్టు సమాచారం.
రానున్న ఆర్డర్లకు అనుగుణంగా ఉత్పాదక సామర్ధ్యాలను విస్తరించాలని యాపిల్ కసరత్తు సాగిస్తోంది. తయారీదారుల నుంచి సేకరించే ఎలక్ట్రిక్ సెల్స్ను ఐఫోన్ తయారీ ప్రక్రియకు ఉద్దేశించిన అసెంబ్లర్లకు తరలించే ముందు వాటి ప్యాకేజింగ్ ప్రక్రియను డీసే, సింప్లో చేపడతాయి. ఇక జపాన్ కంపెనీ టీడీకే హరియాణలోని మనేసర్లో 180 ఎకరాల స్ధలంలో ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది.
ఐఫోన్స్ కోసం ప్రత్యేకంగా ఈ ప్లాంట్లో బ్యాటరీలను తయారుచేస్తారని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఇటీవల వెల్లడించారు. యాపిల్ గత రెండేండ్లుగా చైనా తయారీదారులపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గిస్తూ భారత్, వియత్నాం వంటి మార్కెట్ల వైపు దృష్టిసారిస్తోంది.
Read More :
Skin Care | ఇలా చేస్తే చలి నుంచి చర్మాన్ని రక్షించుకోవచ్చు!