(Obesity) ఊబకాయం ప్రస్తుత తరాన్ని పీడిస్తున్న అతి పెద్ద సమస్య. అమెరికా, చైనా దేశాలు ఊబకాయంలో మొదటి, రెండు స్థానాల్లో ఉండగా.. మన దేశం మూడో స్థానంలో నిలిచింది. జీవనశైలిలో మార్పులు, వ్యాయామానికి దూరంగా ఉండటం, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలు తినడం వల్ల ఊబకాయం వస్తుందని నిపుణులు చెప్తుంటారు. ఊబకాయులైన తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలకి 80 శాతం ఊబకాయం వస్తుంది. అలాగే తల్లిదండ్రులలో ఏ ఒక్కరికైనా ఈ సమస్య ఉన్నట్లయితే 50 శాతం వరకు వారి పిల్లలకు ఊబకాయం వచ్చే అవకాశం ఉన్నట్లుగా గత పరిశోధనలు వెల్లడించాయి. అయితే, స్థూలకాయం పెరగడానికి గల మరో ముఖ్య కారణాన్ని అమెరికన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మానవ శరీరంలోని 14 రకాల జన్యువుల కారణంగా మనలో ఊబకాయం వస్తుందని వర్జీనియా విశ్వవిద్యాలయంలోని కాలేజీ ఆఫ్ ఆర్ట్ ఆండ్ సైన్స్ పరిశోధకులు సెలవిస్తున్నారు.
ఈ 14 రకాల జన్యువుల కారణంగా మానవులు గుండె జబ్బులు, మధుమేహం వంటి వ్యాధులతో పోరాడుతున్నారు. ఊబకాయం కూడా ఒక అంటువ్యాధి అని వర్జీనియా విశ్వవిద్యాలయం పరిశోధకులు అంటున్నారు. అధిక క్యాలరీల ఆహారం, అధిక మొత్తంలో చక్కెర, ఫ్రక్టోజ్ తీసుకున్నప్పుడు స్థూలకాయం పెరుగుతుంది. అయితే, మానవ జన్యువులు కూడా ఊబకాయం రావడానికి కారణమని వీరి పరిశోధన స్పష్టం చేస్తున్నది. ఇటువంటి జన్యువులను నియంత్రించడం ద్వారా ఊబకాయం తగ్గుతుందని వారంటున్నారు. పరిశోధనల ప్రకారం, మానవులు తీసుకున్న అదనపు ఆహారాన్ని కొవ్వుగా మార్చే పనిని ఏ జన్యువులు చేస్తున్నాయో తెలుసుకున్న తర్వాత, ఈ జన్యువును ఔషధాల ద్వారా పనిచేయకుండా చేయవచ్చు. ఈ విధంగా ఊబకాయాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. దీనితో పాటు మధుమేహం వంటి అనేక వ్యాధులను కూడా నివారించవచ్చు.
మానువుడిలో మాదిరిగా జన్యువులు కలిగివున్న ఓ క్రిమిపై ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయని పరిశోధక బృందంలోని సభ్యురాలు ఎలిన్ ఓ రూర్కె తెలిపారు. ఈ కీటకం నిజానికి వెజిటేరియన్ అని, దీనిలో మనుషుల్లో మాదిరి 70 శాతం జీన్స్ లభించాయని పేర్కొన్నారు. ఇవి కూడా మనుషుల మాదిరిగా చక్కెరలను ఎక్కువగా తినడం వల్ల ఊబకాయానికి చేరువైనట్లు గుర్తించినట్లు వెల్లడించారు. కీటకాల సహాయంతో స్థూలకాయానికి సంబంధించిన 293 జన్యువులను మానవుల్లో కూడా కనుగొన్నారు. వీటిలో 14 స్పష్టంగా ఊబకాయం పెంచే జన్యువులు కాగా, పెరుగుతున్న బరువును నియంత్రించడంలో 3 జన్యువులు సహాయపడతాయి. ఈ పరిశోధన ఫలితాలతో రానున్న రోజుల్లో ఊబకాయం సమస్యను పరిష్కరించేందుకు ఔషధాలను తీసుకొచ్చేందుకు మందుల తయారీ కంపెనీలకు అవకాశం లభించనున్నది.
భారత్లో 20 లక్షల వాట్సాప్ ఖాతాలు మూసివేత
ఈశాన్యంలో పర్యటిస్తున్న వెంకయ్యనాయుడు
తైవాన్లోకి మళ్లీ చొరబడిన చైనా విమానాలు
రాజస్థాన్లో సాగునీటి కోసం రైతుల ఆందోళన
జీపుల కొనుగోలు కేసులో ఇందిరా గాంధీ అరెస్ట్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..