న్యూయార్క్ : వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా పలు టెక్ కంపెనీలు మాస్ లేఆఫ్స్కు తెగబడుతుండగా ఈ చర్యలు ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉద్యోగుల నైతిక స్ధైర్యాన్ని దెబ్బతీయడంతో పాటు ఉద్యోగ భద్రతపై నీలినీడలు పరుచుకుంటున్నాయి. కంపెనీలు తమ పట్ల వ్యవహరిస్తున్న తీరుపై కూడా ఉద్యోగులు కలత చెందుతున్నారు. సీటెల్ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న అమెజాన్ ఉద్యోగులు (Amazon) యాజమాన్యం తీరును వ్యతిరేకిస్తూ వచ్చే వారం విధుల నుంచి వాకౌట్ చేయడంతో పాటు నిరసనలు చేపట్టాలని నిర్ణయించారని వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది.
ఉద్యోగుల్లో ఎన్నడూ లేనంత నైతిక స్ధైర్యం లోపించింది, అనిశ్చితి నెలకొనగా నాయకత్వ శ్రేణుల నుంచి అస్పష్టత కొనసాగుతోందని నిరసనల్లో పాల్గొనేందుకు సిద్ధమైన ఓ అమెజాన్ ఉద్యోగి వెల్లడించారు. మే 31న జరిగే నిరసనలో పాల్గొనాలని నిర్వాహకులు ఇతర ఉద్యోగులకు మెసేజ్లు పంపారని తెలిసింది. కంపెనీ వార్షిక వాటాదారుల సమావేశం ముగిసిన అనంతరం ఉద్యోగులకు నిరసనలకు పిలుపు ఇచ్చారు. మరోవైపు ఉద్యోగుల్లో పెరుగుతున్న అసహనం, ఇటీవలి లేఆఫ్స్, వర్క్ ఫ్రం హోం పద్ధతికి స్వస్తి పలికిన నేపధ్యంలో అమెజాన్ వైఖరిని ఉద్యోగులు తీవ్రంగా తప్పుపడుతున్నారు.
ఆర్ధిక మాంద్యం భయాలు, మందగమనం సాకుతో అమెజాన్ ఈ ఏడాది ఆరంభంలో 18,000 మందిని తొలగించగా ఇటీవల 9000 మంది ఉద్యోగులపై వేటు వేసింది. అడ్వర్టైజింగ్, హెచ్ఆర్, క్లౌడ్ కంప్యూటింగ్ సహా పలు విభాగాల్లో లేఆఫ్స్కు కంపెనీ తెగబడింది. ఈ-కామర్స్ దిగ్గజం ఇప్పటివరకూ ఏకంగా 27,000 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. ఇక మెటా, ట్విట్టర్, గూగుల్ వంటి టెక్ దిగ్గజాలు సైతం పెద్దసంఖ్యలో కొలువుల కోతకు తెరలేపాయి.
Read More
BDL Recruitment | భారత్ డైనమిక్స్ లిమిటెడ్లో 100 పోస్టులు