Amazon | ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ముంచుకొస్తున్న నేపథ్యంలోఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారీగా ఉద్యోగాల ఉద్వాసనకు సిద్ధమైంది. అందుకోసం భారత్లో నిర్వహిస్తున్న ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ మూసేస్తున్నట్లు గురువారం ప్రకటించింది. హైస్కూల్ స్థాయి విద్యార్థుల్లో స్కిల్స్ పెంచడానికి అమెజాన్ గతేడాది ప్రారంభంలో ఈ లెర్నింగ్ కేంద్రాన్ని ప్రారంభించింది. కానీ మూసివేతకు ఎటువంటి కారణం వెల్లడించలేదు.
కరోనా మహమ్మారి వేళ.. ఆన్లైన్ లెర్నింగ్కు గిరాకీ ఎక్కువ కావడంతో అమెజాన్ ఈ ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చింది. ఇది జేఈఈ వంటి కాంపిటీటివ్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు శిక్షణనిస్తున్నది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే మూసివేత నిర్ణయం తీసుకున్నామని అమెజాన్ ప్రకటన చేసింది. ప్రస్తుతం కస్టమర్లు సేవలు అందుకుంటున్న నేపథ్యంలో దశల వారీగా ఈ ప్లాట్ఫామ్ మూసివేత నిర్ణయాన్ని అమలు చేస్తామని పేర్కొంది.
తాము నేరుగా ఉద్వాసన పలకడానికి బదులు స్వచ్ఛంద రాజీనామా ఆప్షన్ కల్పిస్తున్నది అమెజాన్. అలా చేసిన వారికి వేతన సంబంధ ప్రయోజనాలు వస్తాయని చెప్పినట్లు సమాచారం. దీంతో భారతీయ ఉద్యోగులంతా స్వచ్ఛందంగా తప్పుకోవడానికి మొగ్గుతున్నారని సమాచారం. స్వచ్ఛంద రాజీనామాకు సిద్ధమైన ఉద్యోగులు ఈ నెల 30 లోగా వాలంటరీ సెపరేషన్ ప్రోగ్రామ్పై సంతకం చేయాల్సి ఉంటుందని తెలిసింది.
రెండేండ్లుగా హడలెత్తించిన కొవిడ్-19 నియంత్రణలోకి రావడంతో విద్యాసంస్థల నిర్వహణ సాధారణ
స్థాయికి చేరుకున్నది. ఈ నేపథ్యంలో ఆన్లైన్ కోచింగ్ ఇస్తున్న పలు సంస్థలు ఆచితూచి స్పందిస్తున్నది. ఇంతకుముందు ఎడ్ స్టార్టప్ సంస్థ బైజూస్ 2,500 మందిని తొలగించిన సంగతి తెలిసిందే. అన్ అకాడమీ, వైట్ హ్యాట్ జూనియర్ వంటి సంస్థలు కూడా ఉద్వాసనలు ప్రకటించాయి.