న్యూఢిల్లీ : ఎయిర్టెల్ 5జీ ప్లస్ సేవలను భారత్లోని 12 నగరాల్లో లాంఛ్ చేసింది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, వారణాసి, సిలిగురి, బెంగళూర్, నాగపూర్, చెన్నై, గురుగ్రాం, పానిపట్, పట్నా, గువహటి సిటీల్లో 5జీ సేవలను ఎయిర్టెల్ అందుబాటులోకి తీసుకువచ్చింది. 2024 ఆరంభం నాటికి దేశవ్యాప్తంగా 5జీ సేవలను అందించే లక్ష్యంలో భాగంగా సిబ్బందికి అవసరమైన నైపుణ్యాలు, శిక్షణ అందించేందుకు కసరత్తు సాగిస్తోంది.
ఈ క్రమంలో 5జీ సంబంధిత రోల్స్లో పెద్దసంఖ్యలో మహిళా ఇంజనీర్లను రిక్రూట్ చేసుకునేందుకు ఎయిర్టెల్ సన్నాహాలు చేపట్టింది. మహిళా ఇంజనీర్లకు రిమోట్ వర్కింగ్ వంటి అవసరమైన సపోర్ట్ అందిస్తామని, పెద్దసంఖ్యలో మహిళా ఇంజనీర్లను రిక్రూట్ చేసుకుంటామని భారతి ఎయిర్టెల్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ అమృత పద్దా తెలిపారు.
ఇంటిలోనే వర్క్ స్పేస్ ఏర్పాటు చేసేందుకు మహిళా ఇంజనీర్లకు సాయం అందిస్తామని, సరైన అభ్యర్ధులను ఎంచుకుని వారిని ఎక్కువకాలం కంపెనీలో కొనసాగేలా చూస్తామని పేర్కొన్నారు. వైవిధ్య కార్యక్రమాల్లో భాగంగా ఈ దిశగా నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఎయిర్టెల్లో దాదాపు 20,000 మంది ప్రొఫెషనల్స్కు 5జీ సన్నాహాకాల్లో భాగంగా ఐపీ టెక్నాలజీ బేసిక్స్పై శిక్షణ ఇచ్చామని చెప్పారు. ఈ ఆర్ధిక సంంవత్సరాంతానికి 5జీ ప్రొఫైల్స్ కోసం నూతన నియామకాలు చేపడతామని తెలిపారు.