న్యూయార్క్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రయోజనాలు, సవాళ్లపై టెక్ ప్రపంచంలో హాట్ డిబేట్ సాగుతుండగా, న్యూ టెక్నాలజీతో (AI Tools) పలువురి ఉద్యోగాలు ఊడతాయని కొందరు టెక్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏఐ స్టార్టప్ ఫౌండర్ తాజాగా ఏఐ పర్యవసానాలపై బాంబు పేల్చారు. ఏదో ఒక రోజు ఏఐ మనుషులపై పట్టు సాధిస్తుందని ఇది క్రమంగా మానవాళిని తన అధీనంలోకి తీసుకుంటుందని లండన్కు చెందిన స్టార్టప్ స్టెబిలిటీ ఏఐ వ్యవస్ధాపకుడు ఇమన్ మొస్తాక్ హెచ్చరించారు.
మనుషులతో విసుగుచెందిన ఏఐ ఏదో ఒకరోజు మనకు వీడ్కోలు పలకవచ్చని బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏఐ విస్తరిస్తోందని, ఇది మానవత్వాన్ని తన కంట్రోల్లోకి తీసుకుంటుందని అన్నారు. ప్రజలు ఇప్పటివరకూ ఏఐతో వచ్చే ముప్పును పసిగట్టకుండా నూతన టెక్నాలజీపై ముందుకెళ్లడంలో బిజీగా ఉన్నారని వ్యాఖ్యానించారు.
పలు కంపెనీలు తమ రోజువారీ కార్యకలాపాల్లో ఏఐ వినియోగాన్ని చేపడుతున్నాయి. ఏఐ పురోగతిని ప్రస్తావిస్తూ ప్రభుత్వాలు ఏఐ ముప్పుపై తక్షణమే మేలుకొని చర్యలు చేపట్టాలని కోరారు. ఏఐ పెనుముప్పు ప్రపంచాన్ని కబళించకముందే ప్రభుత్వాలు స్పందించాలని అన్నారు. ఏఐ నుంచి ముంచుకొచ్చే ముప్పుపై మొస్తాక్ ఒక్కరే కాదు గూగుల్లో పదేండ్లకు పైగా పనిచేసి ఏఐ పురోగతిలో కీలక పాత్ర పోషించి ఏఐ గాడ్ఫాదర్గా పేరొందిన జాఫ్రీ హింటన్ సైతం న్యూ టెక్నాలజీ విపరిణామాలపై హెచ్చరించారు.
Read More