Chandrayaan-3 | రష్యా పంపిన లూనా-25 విఫలం కావటంతో.. దక్షిణ ధ్రువం ఇప్పుడు పెద్ద సవాల్గా మారింది. అమెరికా, చైనాలు కూడా దక్షిణ ధ్రువాన్ని లక్ష్యంగా చేసుకొని స్పేస్క్రాఫ్ట్లను పంపడానికి సిద్ధమవుతున్నాయి. ఆయా దేశాల్లోని స్పేస్ ఏజెన్సీలు, ప్రైవేటు కంపెనీలు అత్యంత సవాల్, సంక్లిష్టతతో కూడిన ‘దక్షిణ ధ్రువం’పైకి స్పేస్క్రాఫ్ట్లను పంపటానికి ప్రయత్నిస్తున్నాయి. చంద్రుడిపై కాలనీలు ఏర్పాటుచేయాలని, మైనింగ్ జరిపి విలువైన ఖనిజాల్ని సేకరించాలని స్పేస్ ఏజెన్సీలు, ప్రైవేటు కంపెనీలు భావిస్తున్నాయి. అంగారకుడిపైకి మానవ సహిత యాత్రలను చేపట్టాలంటే, ముందు చంద్రుడిని పూర్తిస్థాయిలో మానవుడు అందుకోవాలి. భూమి నుంచి బయల్దేరిన రాకెట్లోని ఇంధనం.. సుదూర అంతరిక్ష యాత్రలు సరిపోదని సైంటిస్టులు చెబుతున్నారు. ముందుగా చంద్రుడిపై దిగి, అక్కడి నుంచి ఇతర గ్రహాలను చేరుకోవాలని భావిస్తున్నారు.
నీటి జాడ ఎలా కనుగొన్నారు?
చంద్రుడిపై నీటి ఆనవాళ్ల కోసం అన్వేషణ ఈనాటిది కాదు. జాబిల్లిపై నీరు ఉండొచ్చని సైంటిస్టులు 1960లోనే ఒక అంచనాకు వచ్చారు. ఇది నిజమా?కాదా? అన్నది తెలుసుకునేందుకు అమెరికా, రష్యా, చైనా, భారత్.. సహా పలు దేశాల అంతరిక్ష పరిశోధనా సంస్థలు పదుల సంఖ్యలో లూనార్ మిషన్లు చేపట్టాయి. నాసా ‘అపోలో మిషన్’ ద్వారా వ్యోమగాములు సేకరించిన అక్కడి మట్టి నమూనాలను పరిశీలించాక.. నీటి జాడలేదని తేలింది. నమూనాలను తిరిగి పరిశీలించిన బ్రౌన్ యూనివర్సిటీ పరిశోధకులు స్వల్ప పరిమాణంలో ‘హైడ్రోజన్’ ఉన్నట్టు 2008లో కనుగొన్నారు. 2009లో ఇస్రో పంపిన ‘చంద్రయాన్-1’ జాబిల్లిపై నీటి జాడను గుర్తించింది.
నీరు ఎందుకంత ముఖ్యం?
చంద్రుడిపై ఏండ్లుగా మంచురూపంలో ఉన్న నీటిపై శాస్త్రవేత్తలు ఆసక్తిగా ఉన్నారు. చంద్రుడిపై అగ్నిపర్వతాలు, సముద్రాల పుట్టుకకు సంబంధించిన కీలక సమాచారం దీని ద్వారా తెలుసుకోవచ్చని వారు భావిస్తున్నారు. నీరు తగినంత ఉంటే చంద్రుడి అన్వేషణలో తాగునీటిగానూ, యంత్రాల చల్లదనానికి వినియోగించుకోవచ్చు. అలాగే నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్గా విడగొట్టడం ద్వారా ఇంధనంగానూ, ప్రాణవాయువుగా వాడుకోవచ్చు.
దక్షిణ ధ్రువం ఎందుకంత సంక్లిష్టం?
చంద్రుడి దక్షిణ ధ్రువం పూర్తిగా బిలాలు, అగాథాలతో కూడుకున్నది. ఇక్కడ అడుగుపెట్టడం కష్టమైన పని. చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగేందుకు రష్యా ఇటీవల లూనా-25 వ్యోమనౌకను ప్రయోగించగా అది చంద్రుడి ఉపరితలంపై కుప్పకూలింది. తాజాగా చంద్రయాన్ 3 దక్షిణ ధ్రువంపై విజయవంతంగా అడుగుపెట్టింది.