Aditya L1 | సూర్యుడిపై అధ్యయనం నిర్వహించేందుకు భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ తొలిసారిగా ఆదిత్య ఎల్-1 మిషన్ చేపట్టింది. ఆదిత్య ఎల్-1 త్వరలోనే లక్ష్యాన్ని చేరనున్నది. ఈ విషయాన్ని ఇస్రో చీఫ్ సోమ్నాథ్ వెల్లడించారు. ఆదిత్య సరైన మార్గంలోనే ప్రయాణిస్తోందని, సాఫీగా చివరి దశకు చేరుకుంటుందని భావిస్తున్నామన్నారు. జనవరి 77న ఆదిత్య ఎల్-1 తుది విన్యాసాన్ని చేపట్టి ఎల్-1 పాయింట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఆదిత్య ఎల్-1ని ఇస్రో శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి సెప్టెబర్ 2న విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే.
ఈ అంతరిక్ష నౌక 125 రోజుల్లో దాదాపు 15లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించి సూర్యుడికి సమీపంలోని లాగ్రేంజియన్ పాయింట్ను చేరుకుంటుంది. ఇక్కడి నుంచి సూర్యుడిపై అధ్యయనం నిర్వహిస్తూ ఉంటుంది. ఆదిత్య-ఎల్1 సూర్యుడి లాగ్రేంజియన్ పాయింట్ నుంచి చిత్రాలను తీసి భూమికి పంపుతుంది. ఇక ఆదిత్య ఎల్-1 నౌక సూర్యుడు, భూమికి మధ్య ఉన్న ఎల్-1 పాయింట్ దగ్గరలోని ‘హాలో ఆర్బిట్లో తిరుగుతుంది. ఇది భూమికి 15లక్షల కిలోమీటరల్ దూరంలో ఉంది.
ఇక్కడి నుంచి సూర్యుడికి సంబంధించి ఒక్కో నిమిషానికి ఒక్కో ఫొటో చొప్పున రోజుకు 1440 ఫొటోలను తీసి ఇస్రోకు చేరవేస్తుంది. ఆదిత్య-ఎల్ 1 మొత్తం ఏడు పేలోడ్లను మూసుకెళ్లగా విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్ (VELC)తో పాటు సోలార్ అల్ట్రావయోలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పరిమెంట్, ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య, సోలార్లో ఎనర్జీ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్, హైఎనర్జీ ఎల్-1 ఆర్బిటింగ్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్, మాగ్నెటో మీటర్లు ఉన్నాయి. సౌర వాతావరణం, సౌర జ్వాలలు, కరోనల్ హీటింగ్, కరోనల్ మాస్ ఎజెక్షన్పై అధ్యయనం చేసేందుకు అవసరమైన డేటాను అందించనున్నాయి.