5G Smartphones | ఇప్పుడంతా టెక్నాలజీ మయం.. గతేడాది 5జీ సేవలు యూజర్లకు అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో రెండేండ్ల క్రితం దేశీయ మార్కెట్లోకి నెమ్మదిగా ఎంటరైన 5జీ స్మార్ట్ ఫోన్ల విక్రయాలు ఈ ఏడాది భారీగా పుంజుకుంటాయని సైబర్ మీడియా రీసెర్చ్ (సీఎంఆర్) అంచనా వేసింది. ఈ ఏడాది చివరికల్లా 5జీ స్మార్ట్ ఫోన్ల విక్రయంలో 13 రెట్ల గ్రోత్ నమోదవుతుందని.. 70 శాతం సేల్స్ పెరుగుతాయని పేర్కొంది. రెండేండ్ల క్రితం అంటే 2020లో కేవలం నాలుగు శాతం సేల్ అయ్యాయి. ఈ ఏడాది మొత్తం స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో 5జీ ఫోన్లకు 45 శాతం వాటా ఉంటుందని తెలుస్తోంది. ప్రత్యేకించి రూ.10 వేల నుంచి రూ.20 వేల లోపు స్మార్ట్ ఫోన్లకు ఫుల్ గిరాకీ ఉంటుందని వ్యాఖ్యానించింది.
గతేడాది దాదాపు 100 `5జీ స్మార్ట్ ఫోన్లు` మార్కెట్లోకి వచ్చాయి. నూతనంగా మార్కెట్లో విడుదల చేసిన స్మార్ట్ ఫోన్లలో 75 శాతం 5జీ సపోర్టెడ్గా ఉంటాయని సీఎంఆర్ వెల్లడించింది. ఇక శ్యామ్సంగ్, వన్ ప్లస్, వివో బ్రాండ్ల ఆధిపత్యమే ఉంటుందని తెలిపింది. షియోమీ, రియల్మీ బ్రాండ్లకు చెందిన రూ.10,000-20,000 క్యాటగిరీ ఫోన్ల సేల్స్ అత్యధికంగా జరుగుతాయని అంచనా వేసింది.
దేశవ్యాప్తంగా 5జీ నెట్వర్క్ లభ్యతను బట్టి 5జీ స్మార్ట్ ఫోన్ల కొనుగోళ్లు ఆధారపడి ఉంటాయి. `వినియోగదారులు తమ ఫోన్లను అప్గ్రేడ్ చేసుకోవాలని కోరుకుంటారు. 5జీ స్మార్ట్ ఫోన్ల వాడకం దిశగా మొగ్గుతారు. భారతీయ టెల్కో సంస్థల దూకుడుగా 5జీ నెట్వర్క్ అందుబాటులోకి తీసుకొస్తే ఈ ఏడాది 5జీ స్మార్ట్ ఫోన్లకు భారీగా గిరాకీ ఉంటుంది` అని సైబర్ మీడియా రీసెర్చ్ (సీఎంఆర్) ఇండస్ట్రీ ఇంటెలిజెన్స్ గ్రూప్ (ఐఐజీ) అనలిస్ట్ శిప్రా సిన్హా చెప్పారు.