అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గుచూపుతోంది. సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో పరీక్షలపై ఏపీ సీఎం జగన్ త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. ఏపీలో టెన్త్ పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ స్పష్టం చేశారు. సెప్టెంబర్ రెండో తేదీ లోపు పదో తరగతి పరీక్ష ఫలితాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.
జూలై 26 నుంచి ఆగస్టు 2 వరకు పది పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది. సుమారు 4వేల సెంటర్లలో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే పరీక్షలకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడుతుందని అంచనా వేస్తున్నారు.
వచ్చే నెల మొదటి వారంలో ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నామని, జూలై చివరి వారంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించే అవకాశముందని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించిన విషయం తెలిసిందే.