అంబర్పేట, మే 20 : కరోనా బారినపడి భోజనం వండుకోలేని స్థితిలో ఉన్న బాధితులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. అంబర్పేట నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కరోనా సోకిన బాధితులకు భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎమ్మెల్యే నేతృత్వంలో టీమ్ కాలేరు, స్వచ్ఛ కర్మ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కార్తీక్ సూర్య ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లు చేశారు. పదకొండు రోజులుగా ప్రతి రోజూ రెండు పూటలా 300 మందికి భోజన సదుపాయం కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు 6,600 భోజన ప్యాకెట్లను అందజేశారు. లాక్డౌన్ మొత్తం కరోనా బాధితులకు భోజన సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో పేద, ధనిక తేడా లేకుండా చాలా మంది భోజనానికి ఇతరులపై ఆధారపడాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కరోనా బారినపడిన కుటుంబాలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు వారికి అవసరమైన భోజనాన్ని వారి ఇండ్ల వద్దకే పంపించేందుకు టీమ్ కాలేరు, స్వచ్ఛ కర్మ ఫౌండేషన్ ద్వారా ఏర్పాట్లు చేశారు. పదకొండు రోజులుగా ప్రతి రోజూ రెండు పూటలా భోజనాన్ని తయారు చేయించి ప్యాకింగ్ చేసి కొవిడ్ బాధితుల ఇంటికి పంపిస్తున్నారు. అంతేగాక అవసరమైన మందులు కూడా పంపిస్తున్నారు. గురువారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, స్వచ్ఛకర్మ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కార్తీక్ సూర్య స్వయంగా కొవిడ్ బాధితుల ఇంటికి వెళ్లి భోజన ప్యాకెట్లను పంపిణీ చేశారు.