న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: కరోనా రెండో దశ ఉద్ధృతితో అతలాకుతలమవుతున్న భారత్కు సహాయం అందించడానికి వివిధ దేశాలు ముందుకొస్తున్నాయి. మహమ్మారిపై యుద్ధంలో భారత్కు బాసటగా నిలుస్తామని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా, దుబాయ్ తదితర దేశాలు భరోసా ఇచ్చాయి. ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు, వెంటిలేటర్లు, ఇతర వైద్య పరికరాలు, ఔషధాలతో పాటు మాస్కులు, ఫేస్షీల్డులు, గ్లోవ్స్ పంపిస్తామని తెలిపాయి. భారత్కు వీలైనంత త్వరగా సహాయం అందజేసేందుకు అమెరికా చర్యలు చేపట్టింది. దీనిని ఒక లక్ష్యంగా పెట్టుకుని.. ఈ ప్రయత్నంలో ఎదురయ్యే అధికారిక అడ్డంకులను తొలగించింది. భారత్ అవసరాలను గుర్తించేందుకు వివిధ విభాగాలను అమెరికా ప్రభుత్వం క్రియాశీలకం చేసింది. ఇప్పటికే ప్రధాని మోదీతో అమెరికా అధ్యక్షుడు బైడెన్ మాట్లాడారు. టీకా ముడిపదార్థాలను భారత్కు ఎగుమతి చేస్తామని అమెరికా హామీ ఇచ్చింది. భారత్కు ఆక్సిజన్ ఉత్పత్తి వ్యవస్థలను పంపేందుకు అమెరికా రక్షణ శాఖ ప్రయత్నాలు చేస్తున్నది. ఫ్రాన్స్ కూడా భారత్కు బాసటగా నిలిచింది. మొదటి విడుతలో 5 కంటెనర్ల ద్రవ మెడికల్ ఆక్సిజన్ను పంపిస్తున్నామని, ఇవి 10 వేల మంది రోగులకు ఒక రోజు పాటు సరిపోతుందని ఫ్రాన్స్ తెలిపింది. సింగపూర్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్, సింగపూర్లోని ఇండస్ట్రీ, లిటిల్ ఇండియా షాప్కీపర్స్ అసోసియేషన్ భారత్ కోసం సహాయ నిధిని ప్రారంభించాయి. ఫ్రాన్స్తో పాటు పలు యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు భారత్కు సంఘీభావం ప్రకటించాయి. మందులు, ఆక్సిజన్ పంపుతామని ఐర్లాండ్, బెల్జియం, రొమేనియా, లక్సెంబర్గ్, పోర్చుగల్, స్వీడన్ తెలిపాయి. భూటాన్ కూడా ఆక్సిజన్ను పంపనున్నది.
భారత్కు ఈ వారంలోనే 495 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, 120 నాన్-ఇన్వేసివ్ వెంటిలేటర్లు, 20 మాన్యువల్ వెంటిలేటర్లను పంపుతామని బ్రిటన్ తెలిపింది. వీటిలో 100 వెంటిలేటర్లు, 95 కాన్సన్ట్రేటర్లు మంగళవారం నాడే భారత్కు చేరాయి.
సహాయం అందిస్తామని ఫ్రాన్స్ తెలిపింది. మొదటగా ఈ వారంలోనే 8 పెద్ద ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు, 28 ద్రవ ఆక్సిజన్ రెస్పిరేటర్లు, 200 ఎలక్ట్రిక్ సిరంజ్ పుషర్లను పంపిస్తామని పేర్కొంది. వచ్చే వారంలో 5 ద్రవ ఆక్సిజన్ కంటైనర్లను పంపించనున్నది.
ఐర్లాండ్ 700 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను, జర్మనీ చిన్న ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు, 120 వెంటిలేటర్లు, 8 కోట్ల కేఎన్95 మాస్కులను పంపిస్తామని భరోసా ఇచ్చాయి. 80 మెట్రిక్ టన్నుల ద్రవ ఆక్సిజన్ను పంపిస్తామని సౌదీఅరేబియా హామీ ఇచ్చింది. హాంకాంగ్ 800 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను, థాయ్లాండ్ 4, యూఏఈ 6 క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకులను పంపుతాయని తెలిపాయి.
500 వెంటిలేటర్లు, 10 లక్షల సర్జికల్ మాస్కులు, 5 లక్షల పీ2, ఎన్95 మాస్కులు, లక్ష కళ్లద్దాలు, లక్ష జతల చేతితొడుగులు, 20 వేల ముఖ కవచాలను పంపిస్తామని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ మంగళవారం తెలిపారు.
కరోనాకు చికిత్సలో అవసరమయ్యే ఔషధాలను ఎగుమతి చేస్తామని కువైట్, రష్యా హామీ ఇచ్చాయి. 500 బైపాప్ పరికరాలు, 250 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, 4 క్రయోజెనిక్ ఆక్సిజన్ కంటైనర్లు, ఔషధాలను పంపిస్తామని సింగపూర్ హామీ ఇచ్చింది.
వాషింగ్టన్: కరోనా సృష్టించిన సంక్షోభంతో అతలాకుతలమవుతున్న భారత్కు సహాయం అందించేందుకు అమెరికాలోని 40 అగ్రశ్రేణి సంస్థల సీఈవోలు చేతులు కలిపారు. వారంతా కలిసి గ్లోబల్ టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేశారు. భారత్కు సాయం అందించేందుకు వనరులను సమీకరించడం, సహాయ చర్యలను సమన్వయం చేయడం ఈ టాస్క్ఫోర్స్ లక్ష్యం. అమెరికాలోని కంపెనీలు ఒక దేశానికి సాయం చేయడం కోసం ఇలా సంఘటితమవడం ఇదే మొదటిసారి. ఇది అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్కు చెందిన అమెరికా-ఇండియా బిజినెస్ కౌన్సిల్, అమెరికా-ఇండియా వ్యూహాత్మక, భాగస్వామ్య వేదిక, బిజినెస్ రౌండ్ టేబుల్ సమష్టియత్నం. భారత్కు త్వరలో 20 వేల ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను పంపాలని సోమవారం జరిగిన టాస్క్ఫోర్స్ సమావేశంలో నిర్ణయించినట్టు డెలాయిట్ సీఈవో పునీత్ రంజన్ తెలిపారు.