పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో కీలక ఘట్టమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ బుధవారం ప్రారంభం కానుంది. సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగే ఈ లెక్కింపునకు యంత్రాంగం సకల ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 8 హాళ్లు, హాల్కు ఏడు టేబుళ్ల చొప్పున 56 టేబుళ్లు ఏర్పాటు చేశారు. తొలుత 25 బ్యాలెట్ పేపర్లను లెక్కగడుతారు. దీనికే సుమారు 8 గంటలు పట్టే అవకాశం ఉన్నది. ఆ తర్వాత కట్టలు విప్పి చెల్లని ఓట్లను తొలగించి ప్రాధాన్యత క్రమంలో ఓట్లను వేరుచేస్తారు. రాత్రి 9:30 తర్వాతే తొలి రౌండ్ ప్రారంభం కానుండగా, గురువారం విజేత ఎవరో వెల్లడి కానుంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనంతరం ఏ అభ్యర్థికి 50 శాతానికిపైగా ఓట్లు వస్తాయో వారినే విజేతగా ప్రకటిస్తారు. ఏ అభ్యర్థికి కూడా పోలైన ఓట్లలో 50 శాతంపైగా రాకుంటే రెండో ప్రాధాన్యత ఓట్లను పరిగణనలోకి తీసుకుంటారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో 5,31,268 ఓటర్లు ఉండగా, 3,57,354 ఓట్లు పోలయ్యాయి. మండలి చరిత్రలో 67.26 శాతం పోలింగ్ నమోదు కావడం విశేషం.
సిటీబ్యూరో, మార్చి 16 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నియోజకవర్గంలోని తొమ్మిది జిల్లాల పరిధిలో 5,31,268 ఓట్లుండగా 3,57,354 ఓట్లు పోలయ్యాయి. అయితే పోలైన ఓట్లు అధికంగా ఉండడం, బరిలో 93 మంది అభ్యర్థులు ఉన్నందున ఫలితాల కోసం రెండు నుంచి మూడు రోజులు పట్టే అవకాశాలు కనబడుతున్నాయి. బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే లెక్కింపు ప్రక్రియ నిర్విరామంగా కొనసాగనున్నది. షిఫ్ట్ల వారీగా పని చేసేందుకుగాను అధికారులు, సిబ్బందిని నియమించారు.
పోటీ చేసిన అభ్యర్థులు, ఏజెంట్లు బుధవారం ఉదయం 6.30 గంటల వరకు లెక్కింపు కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఉదయం 7 గంటలకు పోటీ చేసిన అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్రూంలను తెరువనున్నారు. బ్యాలెట్ బాక్సులను తెరిచే ముందు ఏజెంట్లతో పరిశీలన చేసిన అనంతరం వారి సంతకం తీసుకుంటారు. అనంతరం 25 చొప్పున బ్యాలెట్ పత్రాలను కట్టనున్నారు. ఇందుకు దాదాపు 12 గంటల పాటు సమయం పట్టనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అనంతరం కట్ట కట్టిన బ్యాలెట్ పత్రాలను తెరిచి అందులో చెల్లనివి, చెల్లుబాటయ్యే ఓట్లను రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు, కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో వేరు చేస్తారు. అప్పుడు మొదటి ప్రాధాన్యత ఓట్లను అభ్యర్థుల వారీగా లెక్కిస్తారు. ఈ లెక్కన రాత్రి తొమ్మిదిన్నర గంటల తర్వాతనే తొలి రౌండ్ లెక్కింపు ప్రారంభం అవుతుంది. ఇలా 56 టేబుళ్లపైనా ఏకకాలంలో ప్రక్రియ సాగుతుంది. ఒక్కో టేబుల్కు వెయ్యి ఓట్ల చొప్పున ఒక్కో రౌండ్కు 56 వేల ఓట్లను లెక్కించనున్నారు. అయితే పోలైన 3,57,354 ఓట్లను లెక్కించేందుకు దాదాపు 12 గంటల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కించిన అనంతరం ఏ అభ్యర్థికైతే 50 శాతానికి పైగా ఓట్లు వస్తాయో సంబంధిత అభ్యర్థి గెలుపొందినట్లు అధికారులు ప్రకటిస్తారు. అయితే ఏ అభ్యర్థికి కూడా పోలైన ఓట్లలో 50 శాతానికి పైగా ఓట్లు రాలేనట్లయితే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపడుతారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు నుంచి ఎలిమినేషన్ రౌండ్ కూడా ప్రారంభం కానుంది. 93వ అభ్యర్థికి సంబంధించి మొదటి ప్రాధాన్యత ఓటును పరిగణనలోకి తీసుకోకుండా రెండో ప్రాధాన్యత ఓటును ఎవరికి వేశారనేది పరిగణనలోకి తీసుకొని వారికి సంబంధిత ఓట్లను కలుపనున్నారు. ఈ విధంగా చివరి నుంచి ఒక్కో అభ్యర్థిని ఎలిమినేట్ చేస్తూ వారికి వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్లను ప్రధాన అభ్యర్థులకు కలుపనున్నారు. ఈ విధంగా కలిపిన ఓట్లతో ఎవరికి అయితే 50 శాతానికిపైగా ఓట్లు వస్తాయో సంబంధిత అభ్యర్థి విజయం సాధించినట్లు ప్రకటిస్తారు.
సిటీబ్యూరో, మార్చి 16 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు సందర్భంగా రాచకొండ పోలీసు కమిషనరేట్ ఎల్బీనగర్, సరూర్నగర్, చైతన్యపురి పోలీసు స్టేషన్ పరిధిలో మద్యం అమ్మకాలను బుధవారం ఉదయం 6 గంటల నుంచి కౌంటింగ్ పూర్తయ్యే వరకు నిషేధించారు. ఈ నేపథ్యంలో మద్యం దుకాణాలు, బార్లు, కల్లుదుకాణాలను మూసి వేయాలని సీపీ మహేశ్ భగవత్ ఉత్తర్వులు జారీ చేశారు.