న్యూఢిల్లీ: గ్లోబల్ టెక్ దిగ్గజాలు ఆపిల్, ఫేస్బుక్ మధ్య కొన్నాళ్లుగా పచ్చగడ్డి వేసిన భగ్గుమనేలా రెండు సంస్థల మధ్య వాడీవేడీగా మాటల యుద్ధం సాగుతున్నది. ఇటీవల ఆపిల్ సీఈవో టిమ్ కుక్, ఫేస్బుక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జుకర్బర్గ్ పరస్పరం తమ ప్రత్యర్థి సంస్థలను బహిరంగంగానే విమర్శించుకున్నారు. త్వరలో అమలులోకి తేనున్న యాప్ ట్రాకింగ్ ట్రాన్స్పరెన్సీ ఫ్రేమ్వర్క్తోపాటు యూజర్లకు ఆపిల్ సొంతంగా ప్రైవసీ లేబుల్స్ను అందుబాటులోకి తేవడం పలు టెక్ కంపెనీలు, ప్రత్యేకించి సోషల్ మీడియా వేదిక ఫేస్బుక్కు సుతారమూ ఇష్టం లేదు. ఈ నేపథ్యంలోనే ఆపిల్, ఫేస్బుక్ మధ్య మాటల యుద్ధం సాగుతున్నది.
ఇందులో ఫేస్బుక్ అనుబంధ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సీఈవో విల్ కాథ్కార్ట్ వేలుపెట్టారు. ఐఫోన్ల తయారీ సంస్థ ఆపిల్ను లక్ష్యంగా చేసుకుని సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవల ‘బిగ్ టెక్నాలజీ పొడ్కాస్ట్’ అనే అంశంపై జరిగిన చర్చాగోష్టిలో విల్కాథ్కార్ట్ మాట్లాడుతూ ‘ఆపిల్ ప్రైవసీ పాలసీ వివక్షాపూరితం.. ఐఫోన్ మేకర్ ఆపిల్ యాజమాన్యం.. ఆండ్రాయిడ్ ఫోన్లను ప్రజలు వాడటానికి వ్యతిరేకం. ప్రతి ఒక్కరూ ఐఫోన్ మాత్రమే వాడాలన్నది ఆపిల్ ఇంటరెస్ట్. అమెరికాలో అత్యధికులు ఐఫోన్ కలిగి ఉంటారు. ఒకవేళ ప్రతి ఒక్కరి వద్ద ఐఫోన్ ఉంటే మెసేజింగ్ యాప్.. ఐ మెసేజింగ్ పనితీరు మెరుగ్గా ఉంటుంది’ అని తెలిపారు.
వాట్సాప్ యాప్కు ఐఫోన్ మెసేజింగ్ యాప్ ఐ-మెసేజింగ్ ప్రత్యామ్నాయంగా ఉంది. వాట్సాప్ కంటే ఐఫోన్ మెసేజింగ్ యాప్ ఐ మెసేజ్నే అమెరికన్లు వాడతారని విల్ కాథ్కార్ట్ గుర్తు చేశారు. ఆపిల్ ఐఫోన్లలో మాత్రమే ఐ-మెసేజింగ్ యాప్ పని చేస్తుంది. ఒకవేళ ఎవరైనా ఇతర ఫోన్లకు మారినప్పుడు వాటిల్లోని ఆండ్రాయిడ్ సేవలతో వాట్సాప్తో సహా పలు యాప్ల సేవలందుతాయి. కానీ ఆపిల్ సొంత యాప్ ఐ-మెసేజింగ్ మాత్రం వాటిల్లో లభించదని, అందులో వచ్చే మెసేజ్ల కోసం ఐఫోన్లో చెక్ చేసుకోవాల్సిందేనన్నారు.