షాద్నగర్, జనవరి 28 : పౌష్టికాహారాన్ని తీసుకుంటేనే మహిళలు ఆరోగ్యంగా ఉంటారని జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి అన్నారు. చౌదర్గూడ మండలం గుంజల్పహాడ్ గ్రామంలో జడ్పీ నిధులతో నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్తో కలిసి ఆదివారం ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. కుటుంబ అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించడంతో పాటు నేటి సమాజానికే ఆదర్శవంతులుగా నిలుస్తున్న మహిళలు ఆరోగ్యంపై దృష్టి సారించాలని, నాణ్యమైన భోజనాన్ని తీసుకోవాలని కోరారు.
వైద్యుల సలహాలు సూచనలు పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలన్నారు. కిశోర బాలికలు, మహిళలకు అందించే పౌష్టికాహారాన్ని పొందాలని తెలిపారు. ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాలంటే మారుమూల పల్లెల్లో సామాన్య ప్రజలకు ఆరోగ్యాన్ని అందించే కేంద్రాలని అభిప్రాయపడ్డారు. అంగన్వాడీ కేంద్రాలు లేనిచోట్ల నూతనంగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటానని, భవనాలను నిర్మించేందుకు నిధులను మంజూరు చేస్తామని ఆయన చెప్పారు. అనంతరం గ్రామంలోని బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు, మండల నాయకులు పాల్గొన్నారు.