హైదరాబాద్ : కరోనాతో తల్లి మృతి చెందడంతో తీవ్ర మనోవేదనకులోనై కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మధుబాన్ కాలనీలో శనివారం ఈ విషాద ఘటన జరిగింది. చెరువులోకి దూకి బలవన్మరణానికి పాల్పడే ముందు యువకుడు శ్రీహరి (22) సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఇందులో తన కుటుంబ పరిస్థితిని వివరిస్తూ తన ఆవేదనను వెలిబుచ్చాడు.
‘‘కరోనా బారినపడిన మా అమ్మ రుక్మిణి(60) చికిత్స పొందుతూ గచ్చిబౌలిలోని ప్రైవేట్ దవాఖానలో మృతి చెందింది. రూ. 10 లక్షలు చెల్లిస్తేనే మృతదేహం ఇస్తామని దవాఖాన యాజమన్యం చెప్పింది. నా తండ్రి కూడా క్యాన్సర్తో బాధపడుతున్నాడు’’ అని శ్రీహరి ఆవేదన వ్యక్తం చేశాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహం కోసం చెరువులో గాలింపు చేపట్టారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.