జిల్లాలో కరువుఛాయలు అలుముకున్నాయి. తగ్గిన భూగర్భ జలాల తో కండ్ల ముందే వరి పంట ఎండుతుండడంతో అన్నదాతకు కన్నీళ్లు వస్తున్నా యి. అప్పులు చేసి సాగు చేసిన పంట చేతికొచ్చే సమయంలో ఎండి పోతుండ డంతో అతడి పరిస్థితి వర్ణనాతీతంగా మారింది.
-ఇబ్రహీంపట్నం, / మంచాల/ మొయినాబాద్, మార్చి 28
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కరువుఛాయలు అలుముకున్నాయి. భూగర్భజలాలు అడుగంటడంతో బోరుబావులు వట్టిపోతున్నాయి. దీంతో వేలాది ఎకరాల వరి పంట ఎండుముఖం పట్టింది. నియోజకవర్గంలోని మంచాల, యాచారం మండలాలు, చేవెళ్ల నియోజకవర్గంలోని మొయినాబాద్ మండలంలో చేతికొచ్చిన వరి పంట ఎండుతుండడంతో రైతన్నలకు కన్నీళ్లు ఆగడంలేదు. గత యాసంగిలో నియోజకవర్గంలో ఇరవై వేల ఎకరాల్లో రైతులు వరి పంటను సాగు చేశారు. ఆశించిన స్థాయిలో వర్షాలు కురువకపోవడంతో చెరువులు, కుంటలు పూర్తిగా ఎండిపోయి భూగర్భజలాలు తగ్గుముఖం పట్టాయి. ఇప్పటికే సగం వరకు బోరుబావులు ఎండిపోయి మోటర్లు కాలిపోతున్నాయి.
వాటి కింద సాగు చేసిన వరి పంట సగానికిపైగా ఎండిపోయింది. భూములు నెర్రలు తేలాయి. ముఖ్యంగా నల్గొండ, రంగారెడ్డి జిల్లా సరిహద్దులోని దండుమైలారం, ముకునూరు, తాళ్లపల్లిగూడ, చిత్తాపూర్, తిప్పాయిగూడ, ఆరుట్ల, చెన్నారెడ్డిగూడ, బండాలేమూర్, లోయపల్లి, మంతన్గౌరెల్లి, దాత్పల్లి, చీదేడు, నల్లవెల్లి తదితర ప్రాంతాల్లో బోరుబావులు వట్టిపోయి వరిపంటపొలాలూ ఎండుముఖం పట్టాయి. అప్పులు చేసి సాగు చేసిన పంట చేతికొచ్చే సమయంలో ఎండిపోతుండడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది రైతులు పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. అబ్దుల్లాపూర్మె ట్ మండలంలోని మూసీ పరీవాహక ప్రాంతం మినహా మిగతా ప్రాంతాల్లో పంటపొలాలు ఎండుముఖం పట్టాయి.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్ మండలాల్లో ఇప్పటికే తాగునీటికి కటకట మొదలైంది. సక్రమంగా తాగునీరు సరఫరా కాకపోవడంతో ప్రజలు ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం, పెద్దఅంబర్పేట, ఆదిబట్ల, తుర్కయాంజాల్ మున్సిపాలిటీల తోపాటు ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం మండలాల్లోని పలు గ్రామాలు, వార్డులకు సరిపడా తాగునీరు సరఫరా కావడంలేదని ప్రజలు, ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి తాగునీటి ఎద్దడిని తీర్చాలని కోరుతున్నారు.
మంచాల మండలంలో 90 శాతం మేర వరిపంట ఎండిపోయింది. కండ్ల ముందే పంట ఎండిపోతుండడంతో ఎల్లమ్మతండా, బోడకొండ తదితర గ్రామాల్లోని అన్నదాతలు పంటను కాపాడుకునేందుకు నానాతంటాలు పడుతున్నారు. అం దుకోసం ట్యాంకర్ల ద్వారా నీటిని పారిస్తున్నారు. దీంతో ఇదే అదునుగా భావించిన కొందరు వ్యాపారులు ఒక్కో ట్యాంకర్కు రూ.1500 నుంచి రూ. 2000 వరకు వసూలు చేస్తున్నారు. ఆర్థికంగా స్థోమత లేని రైతులు తమ పంటను పశువులు, గొర్రెలకు మేతగా వదులుతున్నారు. ఏటా యాసంగి సీజన్లో మండలంలోని పలు గ్రామాల్లో 7500 ఎకరాలకు పైగా వరి పంటను సాగు చేస్తుంటారు.
ఈ సారి మాత్రం కేవలం 4000 ఎకరాలే సాగుచేశారు. మండలంలో బోరుబావులు తప్పా కాల్వలు లాంటి మరే ఇతర నీటి వసతిలేదు. మండలంలో గతంలో ఐదువందల అడుగుల లోతుకు బోరు వేస్తే కచ్చితంగా నీళ్లు వచ్చేవి. కానీ.. ఆశించిన స్థాయిలో వర్షాలు కురువకపోవడంతో భూగర్భ జలాలు భారీగా పడిపోయాయి. ఏడు వందల నుంచి వెయ్యి అడుగుల లోతుకు బోర్లు వేస్తున్నా చుక్క నీరు రాక దుమ్మురేగుతున్నది. వ్యవసాయ బావుల కింద రైతులు రెండు, మూడు ఎకరాల్లో వరిని సాగు చేసినా.. ఆ పంట కూడా చేతికొ చ్చే పరిస్థితి కనిపించడంలేదు. అప్పులు తెచ్చి పంటను సాగు చేస్తే పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొన్నదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రెండు ఎకరాల్లో వరి, అర ఎకరంలో వంకాయ పంటను సాగు చేశా. ఈసీ వాగు కూడా దగ్గరగానే ఉండడంతో బోరులోని నీటి ధార తగ్గదని భావించా.. కానీ, గత రెండు రోజులుగా బోరు నుంచి నీరు సరిగ్గా రావడం లేదు. దీంతో పంట ఎండిపోతుందనే భయంతో నీటిని కొనుగోలు చేసి పొలాన్ని తడుపుతున్నా. ఒక్కో ట్యాంకర్కు రూ.800 చొప్పున చెల్లించి ఇప్పటివరకు 19 ట్యాంకర్ల ద్వారా నీటిని పోయిస్తే అర ఎకరం పొలం మాత్రమే పారింది. ఎకరం పొలం పారేందుకు కనీసం 40 ట్యాంకర్లు, రెండెకరాలకు సుమారుగా 80 ట్యాంకర్లు నీళ్లు పోయించాల్సి ఉంటుందని.. అంత మొత్తం ఖర్చు చేసి నీటిని పారించినా వరి పంట చేతికి వస్తుందో లేదోనన్న భయంగా ఉన్నది.
-గుత్తి యాదయ్య, రైతు, నక్కలపల్లి, మొయినాబాద్
బోరు కింద మూడు ఎకరాల వరకు వరి పంటను సాగు చేశా. ప్రస్తుతం బోరు నుంచి నీటి ధార చాలా వరకు తగ్గింది. మూడు ఎకరాల పంట సాగవుతుందనే నమ్మకం పోయింది. ఇప్పటికే రెండు ఎకరాల్లోని పంట ఎండిపోయింది. ఈసారి పశువుల మేతకు కూడా కష్టమొచ్చింది.
-సపావట్ మారు(ఎల్లమ్మతండా), రైతు
ఎంత కరువొచ్చినా బోరు నుంచి మంచిగానే నీరు వచ్చేది. ఈసారి వానలు కురువలేదు. దీంతో ఉన్న పొలంలో కొంతలో వరిని సాగు చేశా. బోరు నుంచి నీళ్లు రావడంలేదు. పొలం మొత్తం ఎండిపోయి నెర్రలు తేలాయి. పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొన్నది.
-జాటోతు శంకర్నాయక్( బోడకొండ), రైతు
కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు సాగు నీళ్లకు కొదువేలేదు. వర్షాలు బాగా కురిశాయి. వర్షపు నీటి జాలుతోనే వరి పంటలు పండేవి. ఇప్పుడు ఎక్కడ చూసినా పంటలకు నీళ్లు లేక పొట్ట దశలోనే ఎండిపోతున్నాయి. గత 15 ఏండ్లుగా ఎప్పుడూ ఇలాంటి పరిస్థితిని చూడలేదు. పెట్టిన డబ్బులు కూడా రాని పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం ఆదుకోవాలి.
-సేవ్యానాయక్(సలిగుట్టతండా), రైతు